పోలవరం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కెసిఆర్ తీర్మానం
హైదరాబాద్: పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం శాసనసభలో తీర్మానం ప్రతిపాదించారు. పోలవరం డిజైన్ మార్చి నిర్మాణం చేపట్టాలని తీర్మానం ప్రతిపాదిస్తూ చేసిన ప్రసంగంలో ఆయన అన్నారు. ఆంధ్రలో 7 మండలాలను కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పోలవరం డిజైన్ వల్ల నాలుగు రాష్ట్రాల గిరిజనులు నష్టపోతారని ఆయన అన్నారు. తెలంగాణ అభిప్రాయం తీసుకోకుండా ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన అన్నారు. గిరిజనులు జీవించే హక్కును కోల్పోతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను సమానంగా చూడాలని ఆయన అన్నారు.
తెలంగాణకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శాసనసభ తీర్మానం చేసింది. హైకోర్టు విభజన కూడా జరగాలని ఆయన అన్నారు. రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. పోలవరం డిజైన్ను తాము వైయస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఉండి కూడా వ్యతిరేకించామని చర్చలో పాల్గొంటూ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. 30 రోజులు శాసనసభను స్తంభింపజేశామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టును తమ తెరాస పార్టీ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోందని ఆయన చెప్పారు.
ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన గురుకుల విద్యార్థులు మాలవత్ పూర్ణం, సాధనపల్లి ఆనంద్లను అభినందిస్తూ శాసనసభ తీర్మానం చేసింది. భారత జాతీయ జెండాను, తెలంగాణ జెండాను వారు ఎవరెస్టు శిఖరంపై ఎగురవేశారని ఆయన అన్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పూర్ణ, ఆనంద్లకు చెరో 25 లక్షల రూపాయలు ఇస్తామని, అదే విధంగా వారి కుటుంబాలకు చెరో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తామని కెసిఆర్ చెప్పారు. వారికి శిక్షణ ఇచ్చిన శేఖర్కు 25 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.