కేజ్రీవాల్ విజయం: ఎపిలో కాంగ్రెస్, వైసిపి వలసలకు బ్రేక్?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయం రాజకీయాలను మారుస్తుందా అనే ఆలోచన సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ హవాతో బిజెపి యావత్తు దేశంలో అప్రతిహతంగా ఎదిగే అవకాశం ఉందనే భావనతో ఆంధ్రప్రదేశ్లోని పలువురు రాజకీయ నాయకులు బిజెపివైపు చూస్తున్నారు. ఇప్పటికే, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు చెందిన నాయకులు పలువురు బిజెపిలో చేరారు.
కేజ్రీవాల్ విజయం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, కాంగ్రెసు పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊరటను కలిగిస్తున్నాయి. తమ పార్టీల నుంచి బిజెపిలోకి వలసలు ఆగిపోతాయనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు బిజెపి దారి పడుతున్నట్లు చాలా కాలంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా బిజెపిలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే దాన్ని బొత్స సత్యనారాయణ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరలేని నాయకులు, తెలుగుదేశంలో చేరడానికి ఇష్టం లేని నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి వెళ్తారనే భావన ఉంది. దానివల్ల టిడిపి, బిజెపి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో బలంగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు కూడా సాగాయి. కానీ, ఢిల్లీ ఫలితాలు బిజెపిని బలోపేతం చేయడానికి ఆటంకంగా మారాయని అంటున్నారు.
బిజెపి వైపు చూస్తున్న ఇతర పార్టీల నాయకులు పునరాలోచనలో పడే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు, బిజెపి బలపడడం, బయటకు చెప్పకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూడా ఇష్టం లేదని అంటారు. అందులో ఉన్న నిజమెంతో గానీ చంద్రబాబుకు కూడా తాజా పరిణామం ఊరటనిస్తుందని అంటున్నారు. తన అవసరం లేకుండా బిజెపి ఎదగడం తన స్థానానికి ప్రమాదం తెచ్చి పెట్టవచ్చునని అంటున్నారు. బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనపై ఆధారపడాలనేది ఆయన కోరుకునే విషయం.
కాంగ్రెసు పార్టీ ప్రస్తుత పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి జవజీవాలు పెంచుకోవడానికి ప్రయత్నించడానికి ప్రయత్నాలు సాగించవచ్చు. అదే రీతిలో తమ పార్టీ నుంచి వలసలు ఆగిపోవడంతో వైసిపి బలమైన శక్తిగానే ఉండవచ్చు. దాని వల్ల వచ్చే ఎన్నికల నాటికి, వైసిపి, కాంగ్రెసులు ఏకమైన బిజెపి - టిడిపి కూటమిని ఎదుర్కునేందుకు సిద్ధమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.