పదేపదే అబద్దాలు, నిజాలు తెలియాల్సి ఉంది: కిరణ్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రం ఒక్కటిగా ఉండాలన్నదే తన ఆశయమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు చర్చలో భాగంగా బుధవారం నాటి తన ప్రసంగాన్ని ముఖ్యమంత్రి గురువారం మధ్యాహ్నం శాసన సభలో కొనసాగించారు. కొందరు అసత్యాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
కొందరు సత్య దూర ప్రచారంతో తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించారని, సీమాంధ్ర ముఖ్యమంత్రులు అన్నాయం చేశారన్న భావనను కలిగించారన్నారు. తాము సమైక్యమంటుంటే, మీరు విభజన అంటున్నారని, విద్వేషాలు తొలగించే ప్రయత్నాలు చేస్తానని చెప్పారు. 1956లో రాష్ట్రంలో 69 లక్షల 65 వేల ఏకరాల భూమి సాగులో ఉండేదని చెప్పారు. జూన్ నెలలో రైతుకు నీరు ఇస్తే 75 లక్షల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చునన్నారు.
కృష్ణా నది ఆయకట్టు కింద ఉన్న ఆయకట్టుకు నీరు ఎలా ఇవ్వాలన్న దానిపై ఢిల్లీ ఐఐటి నిపుణులతో అంచనా వేశారన్నారు. ప్రాజెక్టులపై ఏకీకృత వ్యసస్థ లేకుంటే ఇబ్బందులు తప్పవన్నారు. విభజన జరిగితే శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి నిర్వహణన కష్టమవుతుందన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పారు.
పదే పదే తెలంగాణ ప్రాంత నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. నిజాలు చెబితే ఎందుకు ఉలిక్కి పడుతున్నారని, నిజాలను ఒప్పుకునేందుకు గుండె ధైర్యం కావాలన్నారు. తాను ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వాటినే చెబుతున్నానని కిరణ్ బల్లగుద్ది మరీ చెప్పారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి 44,150 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఏకీకృత వ్యవస్థ వల్లనే శ్రీశైలం ప్రాజెక్టు నిలిచిందన్నారు. 11 లక్షల 13వేల ఎకరాల కోసం రూ.12,700లతో చేపట్టిన ప్రాజెక్టులు వృథాగా ఉన్నాయన్నారు.
తెరాస సభ్యులు పదే పదే ప్రసంగానికి అడ్డు తగలడంతో కిరణ్ స్పందిస్తూ.. మనమంతా అన్నదమ్ముల్లాంటి వాళ్లమని, కలిసి ఉండాల్సి ఉందని, కలిసి జీవించాల్సిన అవసరం ఉందన్నారు. పంప్ సెట్లకు ఉచిత విద్యుత్ లబ్ధి పొందింది తెలంగాణ ప్రాంతం మాత్రమేనన్నారు. సింగరేణి బొగ్గును అధిక మొత్తం వినియోగిస్తోంది కూడా తెలంగాణ ప్రాంతమేనని చెప్పారు. ఆంధ్రా ప్రాంతానికి ఒక్క టన్ను బొగ్గు కూడా వెళ్లడం లేదన్నారు.
అంతేకాకుండా బొగ్గు కేటాయింపులు కేంద్రం పరిధిలో ఉంటాయనే విషయం ప్రజలకు తెలియాల్సి ఉందన్నారు. పదేపదే అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలకు నిజాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మా బొగ్గును సీమాంధ్రకు తరలిస్తున్నారని అదే పనిగా ఆరోపణలు చేయవద్దన్నారు. తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఓడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రాంతంలోనే అరవై వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. ఇప్పటి వరకు సాగు కోసం చేసిన వ్యయాలలో తెలంగాణకు అన్యాయం జరగలేదన్నారు. 1956 నుండి ఆంధ్రాలో రూ.31,360 కోట్లు, రాయలసీమలో రూ.25,850 కోట్లు, తెలంగాణలో రూ.44,150 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు.
1956లో తెలంగాణ ప్రాంతంలో కేవలం 231 పంపుసెట్లు మాత్రమే ఉన్నాయని, సీమాంధ్ర ప్రాంతంలో 4,600 ఉన్నాయని, 2012 నాటికి తెలంగాణలో 17 లక్షల పంపుసెట్లు ఉంటే, సీమాంధ్రలో 13 లక్షలు ఉన్నాయన్నారు. ఉచిత విద్యుత్ వల్ల రూ.19,377 కోట్ల రూపాయల మేర తెలంగాణ రైతులు లాభపడ్డారన్నారు. విభజన జరిగితే తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ నష్టమని చెప్పారు.
సభ వాయిదా
కిరణ్ ప్రసంగంపై తెలంగాణ ప్రాంత శాసన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పది నిమిషాలు మాట్లాడుతానని చెప్పారని, ఆ తర్వాత మీరు అడగవచ్చునని, దానికి ఆయన వివరణ ఇస్తారని సభాపతి నాదెండ్ల మనోహర్ చెప్పినప్పటికీ సభ్యులు పోడియం వద్ద ఆందోళన చేశారు. దీంతో సభను సభాపతి పది నిమిషాలు వాయిదా వేశారు.