సంచలనం రేపిన ‘కృపామణి’ ఆత్మహత్య కేసులో కీచకుడి అరెస్ట్
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కృపామణి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు గుడాల సాయి శ్రీనివాస్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరుకు చెందిన వివాహిత కృపామణిపై కన్న తల్లిదండ్రులే వేధింపులకు పాల్పడ్డారు.
భార్య, భర్తల మధ్య గొడవలు రావడంతో పుట్టింటికి వచ్చిన కృపామణిని వ్యభిచారం చేయాలంటూ కన్న తల్లిదండ్రులతో పాటు సోదరుడు కూడా ఒత్తిడి చేశాడు. ఈ క్రమంలో కృపామణిని అదే జిల్లాకు చెందిన రౌడీ షీటర్ గూడాల సాయి శ్రీనివాస్ ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.
ఆత్మహత్యకు ముందు తాను అనుభవించిన నరకయాతనను సూసైడ్ నోట్లో రాసింది. అంతేకాదు, సెల్ఫీ వీడియోలో రికార్డు చేసి మరీ ఆమె తనువు చాలించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించి సమీక్ష కూడా నిర్వహించారు. దీంతో పోలీసుఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఆమె తల్లిదండ్రులు, సోదరుడిని అరెస్ట్ చేశారు.
ఆత్మహత్యకు కొద్ది రోజుల ముందు కృపామణి తల్లి లక్ష్మి... అల్లుడిని చంపుతానని బెదిరించినట్లుగా సెల్ ఫోన్ రికార్డు చేసిన వాయిస్ను పోలీసులకు అందించారు. ఆ తర్వాత కృపామణిపై వేధింపులకు అసలు కారణమైన శ్రీనివాస్ మాత్రం పోలీసులకు చిక్కలేదు.
అతడు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లాను వదిలి హైదరాబాదులో తలదాచుకున్న శ్రీనివాస్ ఆచూకీని కనిపెట్టిన పోలీసులు బుధవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాత్రికి రాత్రే అతడిని పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు.