మేయర్ అనురాధ హత్య: చింటూకు కోర్టులో షాక్, పోలీసులపై జడ్జి ఆగ్రహం
చిత్తూరు: తనను కడప జైలు నుంచి చిత్తూరు జైలుకు తరలించారని చింటూ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. చిత్తూరు నగర మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దంపతుల హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడైన విషయం తెలిసిందే. సోమవారం నిందితులను పోలీసులు కోర్టు ఎదుట ప్రవేశ పెట్టారు.
ఈ సమయంలో చింటూ... రాతపూర్వకంగా తనను చిత్తూరు జైలుకు తరలించారని జడ్జిని అభ్యర్థించాడు. దీనిని కోర్టు తిరస్కరించింది. పోలీసుల కస్టడీలోనే లాయర్తో ఐదు నిమిషాలు మాట్లాడేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కోర్టు ఎదుటే చింటూ లాయర్తో మాట్లాడారు. పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పోలీసులు చింటూను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
మేయర్ దంపతుల హత్య కేసులో ఏ11 నిందితుడిగా పేర్కొంటున్న లాయర్ యోగానంద్ కొద్దిసేపు న్యాయవాదితో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ జడ్జిని అభ్యర్థించాడు. ఆయన అభ్యర్థనను స్వీకరిస్తూ పోలీసుల కస్టడీలోనే 5 నిమిషాలు మాట్లాడేందుకు అనుమతించారు.
దీనిని తిరస్కరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై జడ్జి మండిపడ్డారు. చివరకు కొద్ది సమయం యోగానంద్ కోర్టు ఎదుటే సహచర న్యాయవాదితో మాట్లాడాడు.
కాగా, మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూ, మరో 18 మంది నిందితులకు ఈ నెల 13వ తేదీ వరకు రిమాండు పొడిగిస్తూ సోమవారం స్థానిక నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి యుగంధర్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ హత్యకు సంబంధించి స్థానిక పోలీసులు హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు చింటూ, ఘటనలో పాల్గొన్న, సహకరించిన మరో 21 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం పోలీసులు రిమాండు నిమిత్తం చింటూతో పాటు మరో 18 మంది నిందితులైన వెంకటాచలపతి, జయప్రకాష్రెడ్డి, మంజునాథ్, వెంకటేష్, మురగ, పరందామ, శశిధర్, యోగానందం, హరిదాస్, న్యాయవాదులు యోగానంద్, ఆనంద్కుమార్, రజనీకాంత్, లోకేష్, రఘుపతి, నాగరాజు, కమలాకర్, నరేంద్రబాబు, రమేష్లను కోర్టు ఎదుట హాజరుపరిచారు.
నిందితులకు ఈ నెల 13 వరకు రిమాండు పొడిగిసూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక బందోబస్తు నడుమ చింటూను కడప సెంట్రల్ జైల్ నుంచి తీసుకురాగా, మిగిలిన 18 మంది నిందితులను చిత్తూరు సబ్ జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చారు.