చంద్రబాబుకు మైనారిటీ నేత షాక్...పదవికి రాజీనామా:సిఎం పిలుస్తున్నా...
విజయవాడ:రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా జలీల్ ఖాన్ నియామకంతో టిడిపిలోని మైనార్టీ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. దశాబ్దాల తరబడి పార్టీని నమ్ముకొని విశ్వాసంతో పనిచేస్తుంటే పార్టీ అధినేత ఫిరాయింపుదారులను పిలిచి పట్టం కడుతున్నారంటూ మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే సీనియర్ అయిన తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై మనస్థాపానికి గురైన టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు తన పదవికి రాజీనామా చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేస్తుండగా అమీర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఆ తరువాత నేరుగా సిఎం చంద్రబాబు దగ్గరకు వెళ్లి తన అసంతృప్తిని తెలియజేసి ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారని తెలిసింది. వివరాల్లోకి వెళితే...
వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ను వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా సిఎం చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం జలీల్ ఖాన్ ఇతర సభ్యులు డైరెక్టర్ లు గా ప్రమాణ స్వీకారం చేస్తున్న క్రమంలో సీనియర్ అయిన తనకు వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ పదవిని ఇచ్చి...మొన్నే పార్టీలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన జలీల్ ఖాన్ కు ఛైర్మన్ పదవి ఇచ్చారంటూ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు రాజీనామా చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఆ తరువాత సిఎం చంద్రబాబుకు కూడా ఇదే చెప్పి ఆయన పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్లిపోయారట. కీలకమైన సమయంలో మైనారిటీ నేత నుంచి ఈ విధమైన షాక్ తగలడంతో చంద్రబాబు ఖంగుతిన్నారట. పైగా అమీర్ బాబుది ముస్లింలు ఎక్కువగా ఉన్న కడప అసెంబ్లీ నియోజకవర్గం కావడం, అక్కడ ఇప్పటికే పార్టీ బలహీనంగా ఉండటంతో చంద్రబాబుకు ఇది పెద్ద షాకేనని, అందువల్ల అమీర్ బాబును బుజ్జగించే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.