కేసీఆర్, మమతలు పోరాడుతుంటే జగన్ సైలెన్స్ దేనికి; జగన్ వి పులకేశి రాజకీయాలు: ఎంపీ రామ్మోహన్ నాయుడు
తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసిపి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ పై ప్రజలకు మోజు తగ్గిందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
టీడీపీపై విషప్రచారం చెయ్యటం కొడాలి నాని పని; ఆ విషయంలో గిన్నిస్ రికార్డ్ మీదే: బోండా ఉమ
వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదు
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సమావేశానికి అజెండా సిద్ధం చేసిందని చెబితే ఇదంతా వైసిపి గొప్పతనమన్నట్టు హంగామా చేశారని, ప్రత్యేక హోదా అంశం పరిష్కారమవుతుందని చెప్పుకొచ్చారని పేర్కొన్నారు. గంటల వ్యవధిలో ప్రత్యేక హోదాను కేంద్రం అజెండా అంశంగా తీసేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీలకు చిత్త శుద్ధి ఉంటే రాజీనామా చెయ్యాలి
వైసిపి ఎంపీలు ప్రత్యేక హోదా కోసం కేంద్రం పై పోరాటం చేసింది లేదని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదా పై వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీ పదవులకు రాజీనామా చేయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. జగన్ కేంద్రం విషయంలో మౌనంగా ఉంటున్నారు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే జగన్ ఎందుకు మాట్లాడలేకపోతున్నారో చెప్పాలని నిలదీశారు.
పులకేశి రాజకీయాలు చేస్తున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులకేశి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సమస్య సృష్టించి సినీ ప్రముఖులతో తన దగ్గరకు వచ్చేలా చేసి, హీరోలతో పొగిడించుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ సినీ నటులను మించిన నటన చేస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఒకవైపు కెసిఆర్, స్టాలిన్, మమతా బెనర్జీ కేంద్రంపై పోరాడుతున్నారని, జగన్ ఎందుకు పోరాటం చేయలేక పోతున్నారో చెప్పాలని ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.
నవరత్నాలను సరిగా అమలు చెయ్యలేకపోతున్న జగన్
రాష్ట్రంలో నవరత్నాలను సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు. గ్రామ సచివాలయాలు సరిగా పనిచేయడం లేదని పేర్కొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు పేదవాళ్ళు దౌర్భాగ్య పరిస్థితులను అనుభవిస్తున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీని ఆశ్రయిస్తునున్నట్లుగా ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో అరాచకం మినహా మరేమీ లేదని ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు