నంద్యాల ఉప ఎన్నిక: చంద్రబాబు, జగన్ రూల్స్ను తుంగలో తొక్కారా?
నంద్యాల ఎన్నికను చంద్రబాబు, జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం సాగించారు.మద్దతును కూడగట్టుకోవడానికి వారు నిబంధనలను ఉల్లంఘించి ప్రయత్నాలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్నూలు: నంద్యాల శానససభ ఉప ఎన్నికను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతే ప్రతిష్టాత్మకంగా ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీసుకున్నారు.
ఇరువురు నేతలు కూడా సాధారణ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తూ నంద్యాలలో ప్రచారం సాగించారు. మద్దతును కూడగట్టుకోవడానికి వారు నిబంధనలను ఉల్లంఘించి ప్రయత్నాలు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కులాలు, మతాలవారీగా ప్రచారం సాగించారని అంటున్నారు.
ప్రచారం ప్రారంభమైన తర్వాత అంతర్గతంగా కులాలు, మతాల పెద్దలను పిలిచి రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడారు. చివరలో బహిరంగ సభలు నిర్వహించారు. టిడిపితో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కులాలు, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో సహకరించాల్సిందిగా కోరారు.
జగన్ ఇలా....
వైసిపి అధినేత జగన్ 10 రోజులకు పైగా నంద్యాలలో మకాం వేసి అన్ని గ్రామాలు, వార్డుల్లో రోడ్షోలు నిర్వహించారు. ఆ తర్వాత కులాలు, మతాల సమావేశాలకు తెర తీశారు. ఆయన క్రైస్తవ మత పెద్దలతో, వైశ్య కులపెద్దలతో సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరారు.
Recommended Video
చంద్రబాబు కూడా....
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా క్రైస్తవ, ముస్లిం మతపెద్దలు, వైశ్య, బలిజ కుల పెద్దలతో సమావేశమయ్యారు. నంద్యాలలో పార్టీ అభ్యర్థి విజయం కోసం వారితో సంప్రదింపులు జరిపారు. వీరివురి కన్నా ముందే వైసిపి, టిడిపి నేతలు కులాల నాయకులను పిలిపించుకుని మాట్లాడి మద్దతు కూడగట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారంలో మతాలు, కులాలను ప్రస్తావించడం నిబంధనలను ఉల్లంఘించడమే.
ఎన్టీఆర్ కటౌట్లు తొలగించారు...
గతంలో దివంగత ఎన్టీ రామారావు శ్రీ కృష్ణుడి అవతారంలో ఉన్న కటౌట్లను కూడా ఎన్నికల కమిషన్ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచే రాజకీయ పార్టీల నేతల విగ్రహాలకు ముసుగులు వేయడం ప్రారంభించారు. వారు కూడా ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకూడదన్నదే నిబంధన. అయితే నంద్యాల ఎన్నికల్లో మాత్రం వాటిని పాటించడం లేదు. బహిరంగంగా మతాలు, కులాల సమావేశాలు నిర్వహించారు.
కాంగ్రెసు నేతలు ఇలా...
టిడిపి, వైసిపిలు నిర్వహించిన సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, జెడీ శీలంలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసినా అనుకూల స్పందన కనిపించకపోవడం అభ్యంతరకరమని వారన్నారు. చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో ఒక రోజు రోడ్షోలకు, మరోరోజు కులాలు, మతాల పెద్దలతో మాట్లాడటానికి సమయం కేటాయించారని జగన్ 10 రోజులు రోడ్ షోలు నిర్వహించి ఆ తరువాత వరుసగా కుల, మత సమావేశాలు నిర్వహించారని, ఇవి ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కోట్ల సూర్య ప్రకాశరెడ్డి ఆరోపించారు.