మరో 'పవర్' వివాదం: కృష్ణపట్నం ఎఫెక్ట్, ఎపికి తెలంగాణ షాక్?
హైదరాబాద్: విద్యుచ్ఛక్తిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మరోసారి వివాదం చోటు చేసుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ఇవ్వడానికి నిరాకరించిన ఆంధ్ర రాష్ట్రప్రభుత్వానికి షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జైపూర్ వద్ద సింగరేణి సంస్ధ నిర్మిస్తున్న 1200 మెగావాట్ల జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి ఏపి వాటాను ఇవ్వరాదనే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ మేరకు ఈ ప్లాంట్కు సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కూడా రద్దు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఆంధ్రాకు 46.11 శాతం, తెలంగాణ నుంచి 53.89 శాతం వాటాలు కేటాయించారు. సింగరేణి, ఏపి ట్రాన్స్కో సంస్ధల మధ్య 2011 సంవత్సరంలో జైపూర్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభమవుతుందని అంచనా. ఈ ప్లాంట్ నుంచి దాదాపు 450 మెగావాట్ల విద్యుత్ను ఏపికి కేటాయించాల్సి ఉంది.
కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణమైంది. ఈ ప్లాంట్ కెపాసిటీ 1600 మెగావాట్లు. ఈ ప్లాంట్ నుంచి 862 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. కాని ఏపి ప్రభుత్వం ఈ విద్యుత్ను తొలుత తెలంగాణకు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంపై తీవ్రమైన వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత మారిన పరిస్ధితుల్లో తమకు ఆంధ్రా విద్యుత్ అవసరం లేదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ మేరకు బెంగళూరులోని సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్కు కూడా తెలంగాణ విద్యుత్ సంస్ధ లేఖ రాసింది. త్వరలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతున్న భూపాలపల్లి 600 మెగావాట్ల, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏడవ యూనిట్ 800 మెగావాట్లో కూడా విద్యుత్ను ఏపికి కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది.