గెలిపించారు, గోదావరి ప్రజల్ని ఎలా రక్షిస్తారో మీఇష్టం: బాబుకు పవన్ కళ్యాణ్
తుందుర్రు/అమరావతి: తనకు వచ్చిన సమాచారం మేరకు 2012లో కూడా ఇదే ఆనంద అక్వా ఫుడ్ పార్క్లో గ్యాస్ లీక్ అయిందని, అప్పుడు బాధితులు పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
గురువారం అక్వా ఫుడ్ పార్క్ ఘటనలో అయిదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.
ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి బాధిత కుటుంబాలకు సాయం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. విష వాయువులు పీల్చి దుర్మరణం పాలైన వారి కుటుంబాలు న్యాయం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయన్నారు.

ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారన్నారు. తనకు వచ్చిన సమాచారం ప్రకారం 2012లో కూడా ఇదే కర్మాగారంలో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు.
అప్పుడు బాధితులు పోలీసులకు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. రెండు గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణగా భావిస్తారన్నారు.
అలాంటి పవిత్రమైన గోదావరి నదిని రసాయనాలతో కలుషితం చేస్తున్న కర్మాగారాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొందరు పర్యావరణవేత్తలు జనసేనను సంప్రదించారని చెప్పారు.
కర్మాగారాలు నదులను ఎంత శాతం కలుషితం చేస్తున్నాయో అంచనా వేయగలిగితే వాటిని నిషేధించడానికి తమ జనసేన బృందం పనిచేయాలనుకుంటోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన గోదావరి ప్రజలను ఆ పార్టీ ఎలా రక్షిస్తుందో అది ఆ పార్టీ నాయకుల విజ్ఞతపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు.
తుందుర్రులో ఉద్రిక్తత
అక్వా ఫుడ్ పార్కును ముట్టడించేందుకు పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. దీంతో తుందుర్రులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కే బేతంపూడి నుంచి మహిళలు తరలి వచ్చారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications