భయం వద్దు, చర్యలు తీసుకున్నాం: తుఫానుపై సిఎం
హైదరాబాద్: ఫైలిన్ తుఫానుపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తుఫానుపై ఉన్నతాధికారులతో సమీక్షించిన తర్వాత ఆయన శనివారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తుఫాను విషయంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, తుఫానును ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.
ఆహార పదార్ధాలు, నీళ్లు, మందులు అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. తుపాను తాకిడి ప్రమాదం ఉందని భావించిన ప్రాంతాల నుంచి లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ఆయన సూచించారు. పరిస్థితిని జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
మంత్రులు జిల్లాల్లో ఉన్నారని, రెవెన్యూ మంత్రి విశాఖపట్నంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పశు సంపదను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు
వర్షాల వల్ల నాగావళి, వంశధార తదితర నదులు పొంగి పొర్లే ప్రమాదం ఉందని, వాటి పరీవాహక ప్రాంతాలను కూడా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. వేటకు వెళ్లిన 22 పడవలు సురక్షితంగా తిరిగి వచ్చినట్లు ఆయన తెలిపారు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనాలు వేస్తున్నారని, ఎంత తీవ్రంగా ఉన్నా దాన్ని తట్టుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.