కాల్మనీ కేసు: టిడిపి కార్పొరేటర్ అరెస్ట్, వ్యాపారి వెంకట్రావ్ తోపాటు 9మంది ఇళ్లలో సోదాలు
విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాల్మనీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం గుంటూరులోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 మంది అనుమానితుల ఇళ్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇబ్రహీంపట్నం దొనబండలోని కాల్ మనీ వ్యాపారి కందుల వెంకట్రావ్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 3గంటలుగా ఈ సోదాలు సాగుతున్నాయి. అంతేకా, నగరం పాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో కుమ్మరి చంద్ర, షేక్ బాషా, కె. మనోహర నాయుడు ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రమేష్, వెంకాయమ్మ, పాత గుంటూరు పోలీస్ సేటషన్ పరిధిలో శ్రీనివాసులు రెడ్డి, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వరరావు, కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మున్ని, నాగుల్ మీరా ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రామిసరీ నోట్లు, తనఖా పత్రాలు ఇతర వివరాల కోసం ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. భవనీపురం పీఎస్ పరిధిలోని షకీలా, నూతనపాటి శ్రీనివాసరావులను పోలీసులు విచారిస్తున్నారు.
టిడిపి కార్పొరేటర్ అరెస్ట్
విజయవాడకు చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్ కనకదుర్గ, ఆమె భర్త కొండ తమను వేధిస్తున్నారంటూ కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కార్పొరేటర్ కనకదుర్గ, కొండ ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు.కాగా, మరో టిడిపి నేత జ్వాల చౌదరి ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేస్తున్నారు.
కాల్ మనీ ముసుగులో శ్రీరామాంజనేయ ఫైనాన్స్ పేరుతో వ్యాపారులు అరాచకాలు కొనసాగించారు. ఇందులో ప్రముఖులతోపాటు ఎన్నారైలు, రాజకీయ నేతలు కూడా పెట్టుబడులు పెట్టారు. అవసరమున్న ప్రజలకు అప్పులు ఇచ్చి రెట్టింపు వసూలు చేయడమేగాకుండా, అప్పు తిరిగి ఇవ్వకపోతే ఆస్తుల స్వాధీనం చేసుకుంటున్నారు. లక్షల్లో అప్పులిచ్చిన వ్యాపారులు.. కోట్లలో బలవంతపు వసూళ్లు చేశారు. సుమారు 400కోట్ల విలువైన డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఒక్క విజయవాడలోనే 10వేల మంది కాల్ మనీ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది.