టి బిల్లు వస్తే 25 నుంచి మెరుపు సమ్మె: అశోక్ బాబు
హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు శాసనసభకు వస్తే ఈ నెల 25వ తేదీ నుంచి మెరుపు సమ్మెకు దిగుతామని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు పి. అశోక్ బాబు హెచ్చరించారు. రేపు శనివారం సమైక్యవాదుల సదస్సు జరుగుతుందని, ఈ సదస్సుకు సమైక్యవాదులంతా ఆహ్వానితులేనని, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
రేపటి సదస్సులో రాష్ట్ర విభజనకు సంబంధించిన 11 అంశాలపై చర్చిస్తామని ఆయన చెప్పారు. 11 అంశాలతో రాష్ట్ర విభజన అసాధ్యమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పారు. జీవోఎం ముందు రాజకీయ పార్టీలు స్పష్టమైన అభిప్రాయం చెప్పలేదని ఆయన అన్నారు. డిసెంబర్ లోగా రాష్ట్ర విభజనపై స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. సీమాంధ్రకు చెందిన 173 మంది శాసనసభ్యులు విభజనకు వ్యతిరేకంగా శాసనసభలో ఓటేయకపోతే వారి వారి నియోజకవర్గాల్లో వారిని అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆర్టికల్ 3 దుర్వినియోగం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని దుర్వినియోగపరుస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఎంవి మైసురా రెడ్డి విమర్శించారు. ఈ విషయంపై జాతీయ, ప్రాంతీయ పార్టీలు వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ఆర్టికల్ 3ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ఆర్టికల్ 3ని దుర్వినియోగం చేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ నాయకత్వంలో ఢిల్లీ ఇదే విషయంపై జాతీయ పార్టీల నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు. ఆ తర్వాత కోర్టు అనుమతి తీసుకుని దేశంలోని ఇతర పార్టీల నాయకులను కలుస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications