పదేళ్లుగా విద్యార్థినులకు ప్రిన్సిపల్ వేధింపులు, చెప్పులతో కొట్టారు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమిలో దారుణం వెలుగు చూసింది. విద్యాబుద్దులు నేర్పించవలసిన ప్రిన్సిపల్ విద్యార్థినుల పైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దాదాపుగా పదేళ్లుగా అతను ఈ అరాచకానికి పాల్పడుతున్నాడు. కరస్పాండెంటు విచారణలో ఉపాధ్యాయుడి వేధింపులు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థులను బెదిరించి లోబరుచుకున్నాడు.
ప్రిన్సిపల్ వేధింపులు తాళలేకున్నామని విద్యార్థినులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాద్యాయుడికి దేహశుద్ధి చేశారు. అతనిని చెప్పులతో కొట్టారు. ఇందులో కాంట్రాక్టు ఉపాధ్యాయుడి పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిని ఉద్యోగం నుండి తొలగించారు.
రూ. 30 లక్షల మద్యం పట్టివేత ఇద్దరు నిందితుల అరెస్టు
రూ.30 లక్షల విలువ చేసే మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంటు ప్రణవి వెల్లడించారు. అనంతపురం జిల్లా గుత్తిలో మంగళవారంఆమె విలేకరులకు వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి ఓ కంటైనర్లో మ్యాగీ న్యూడిల్ బాక్సుల వెనుక తరలిస్తున్న 8 వందల హైవా ర్డ్స్, బ్యాగ్పైపర్ మద్యం సీసాలున్న బాక్సులను స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్ను అరెస్టు చేశారు.
గోవాలోనివాస్కో జిల్లా జోరీ నగర్ నుంచి లైసెన్సు లేని మద్యాన్ని కర్నూలుకు తరలిస్తున్నట్టు ఆమె తెలిపారు. దీని వెనుక పెద్ద లిక్కర్ మాఫియా ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. అక్రమ నకిలీ మద్యం తరలింపును అరికట్టేందుకు త్వరలో మొబైల్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు.
దొంగబాబా అరెస్ట్
కరీంనగర్ జిల్లాలో రోగాలు నయం చేస్తానంటూ, అమాయకుల నుంచి వేలాది రూపాయలను వసూలు చేసిన హస్తం ప్రభు అనే ఓ దొంగ బాబాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గల్లీలలో తిరుగుతూ దీర్ఘకాలిక రోగాలను నయం చేస్తానని రుక్మీణిబాయి అనే మహిళ వద్ద రూ.2 వేలు తీసుకొని తాయత్తులు ఇచ్చాడు. అలాగే మరికొంతమందిని మోసం చేశాడు.
కొన్ని రోజులుగా దొంగతనాలు ఎక్కువ కావడంతో, ఈ బాబాపై స్థానికులు అనుమానం వ్యక్తం చేసి, పోలీసులకు సమాచారం అందించారు. తాను బతుకుదెరువు కోసం ఊర్లు తిరుగుతు అమాయక ప్రజలకు మోసం చేస్తు తాయత్తులు ఇస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో హస్తం ప్రభు అంగీకరించాడు. అతనిని అరెస్టు చేశారు.