ఏ ముఖం పెట్టుకుని మా జిల్లాకు వస్తారు: చంద్రబాబుపై రవీంద్రనాథ్ ఫైర్
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ఆయన కమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏ ముఖం పెట్టుకుని కడప జిల్లా పర్యటనకు వస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు.
గండికోట ప్రాజెక్టు ద్వారా సర్వరాయ ప్రాజెక్టుకు నీరు ఇస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చిన చంద్రబాబు దాన్ని అమలు చేయలేదని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసపూరిత మాటలతో కడప వాసులను భ్రమల్లో పెట్టడమే తప్ప చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమేనని ధ్వజమెత్తారు.
పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు నీరు అందిస్తానంటున్న ముఖ్యమంత్రి.. కమీషన్ల కోసమే దాన్ని చేపట్టారని ఆరోపించారు. గండికోట, హంద్రీనీవా ప్రాజెక్టులకు పూర్తిస్థాయి నిధులు కేటాయించినట్లయితే.. కరవు జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతుందని చెప్పారు.
రాష్ట్ర అవసరాలు తీరాకే చమురు తరలించాలి: కొనకళ్ల
ఓఎన్జీసీ లాంటి సంస్థలు రాష్ట్ర అవసరాలు తీరాకే చమురు తరలించాలని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఓఎన్జీసీ భాగస్వామ్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ తవ్విన చమురును మళ్లించకుండా రాష్ట్రప్రభుత్వం ఆంక్షలు విధించాలని, కేజీ బేసిన్లో తవ్వుకున్న చమురు ప్రభుత్వ సంస్థలకే ఉపయోగపడాలని కొనకళ్ల అభిప్రాయపడ్డారు.
బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయాలి: ఎంపి జితేందర్
విశాఖపట్టణం: బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయాలని సిపిఎం ఎంపీ జితేందర్ చౌదరి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియతో మాట్లాడుతూ.. బాక్సైట్ ఒప్పందాల్లో జరిగిన అవినీతి ఒప్పందాలపై 2002 సెప్టెంబరులోనే గిరిజన మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు.
అయినా ప్రభుత్వాలు నేటికీ రద్దు చేయకపోవడం దుర్మార్గమన్నారు. బాక్సైట్ ఒప్పందాలు రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని జితేందర్ చౌదరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.