సంయమనంతో నెగ్గిన అఖిల: మీడియాకు రోజా ఎందుకు ముఖం చాటేసిందంటే?
ప్రచార సమయంలో ప్రదర్శించిన అతి విశ్వాసం, అత్యుత్సాహం వల్లే రోజా మీడియాకు కూడా ముఖం చూపించలేకపోతున్నారని చెబుతున్నారు.
Recommended Video
విజయవాడ: నంద్యాల ఉపఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో బరిలో దిగిన వైసీపీ.. కనీసం గెలుపుకు దగ్గరగా కూడా రాలేక చతికిలపడిపోయింది. ప్రచార సమయంలో జగన్, రోజాలు చేసిన తీవ్ర వ్యాఖ్యల ప్రభావం వల్లనే.. అంచనా కన్నా ఎక్కువ మెజారిటీని టీడీపీ కైవసం చేసుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
జగన్, రోజాల వ్యాఖ్యల పుణ్యమాని తమ మెజారిటీ పెరిగిందని అటు టీడీపీలోను అంతర్గతంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమే కానీ.. మితిమీరిన వైఖరి వల్లే ఇప్పుడు జనం ముందుకు రావడానికి కూడా వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఉపఎన్నిక ఫలితం తర్వాత వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియాకు దూరంగా ఉండటం వెనుక ఇదే కారణంగా కనిపిస్తోంది.
రోజా చీప్ కామెంట్స్:
ముఖ్యంగా అఖిలప్రియ డ్రెస్సింగ్ను సంప్రదాయంతో ముడిపెట్టి ఆమె చేసిన వ్యాఖ్యలు మహిళలంతా వైసీపీకి వ్యతిరేకంగా ఆలోచించేలా చేశాయంటున్నారు. చీరా బొట్టు లేకుండా చుడీదార్ లలో తిరిగే నువ్వా సంప్రదాయం గురించి మాట్లాడేదంటూ ప్రచార సమయంలో అఖిలప్రియపై రోజా ఫైర్ అయ్యారు. మరోవైపు అఖిలప్రియ మాత్రం ఈ వ్యాఖ్యల పట్ల సంయమనం పాటిస్తూ.. అది రోజా విజ్ఞతకే వదిలేస్తున్నానని కామెంట్ చేశారు.
అఖిలప్రియ సంయమనం:
ఒకవిధంగా అఖిలప్రియను రెచ్చగొట్టడానికే రోజా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న విమర్శ ఉంది. దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో అఖిలప్రియ నోరు జారితే ఆమెను ఇరుకుపెట్టవచ్చనేది రోజా ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇక్కడ సీన్ మాత్రం పూర్తిగా రివర్స్ అయింది.
రోజా తరహాలో పెద్ద మాటకారి కానప్పటికీ.. ఆమె వ్యాఖ్యలపై అఖిలప్రియ తెలివిగా వ్యవహరించారు. ఎక్కడ సంయమనం కోల్పోకుండా ఆ వ్యాఖ్యలపై జాగ్రత్తగా స్పందిస్తూ వచ్చారు. దీంతో రోజా చీప్ కామెంట్స్ మహిళల్లోను ఆమె పట్ల వ్యతిరేకత పెరిగేలా చేశాయి. అదే సమయంలో అఖిలప్రియపై అప్పటికే ఉన్న సానుభూతికి తోడు ఆమె సంయమనంగా వ్యవహరించడం వారిని ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ ఎఫెక్టే ఎన్నికల్లో వైసీపీని చావుదెబ్బ తీసిందన్న వాదనలు ఉన్నాయి.
ఇకనైనా రోజాతో వైఖరి మారుతుందా?:
మొత్తం మీద రోజా వైఖరి వైసీపీకి పెద్ద మైనస్ గా తయారైందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలోను 'మేమైనా ఎస్సీలమా.. అలా దూరంగా నిలుచున్నారు' అంటూ పోలీసులతో ఆమె చేసిన వ్యాఖ్యలు దళితులను పార్టీకి దూరమయ్యే దుస్థితి కల్పించాయి. ఒకవిధంగా రోజా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ప్రత్యర్థుల కన్నా వైసీపీకే ఎక్కువ చేటు చేస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికైనా ఆ పార్టీ గ్రహించకపోతే రాబోయే రోజుల్లో మహిళా ఓటర్లు ఆ పార్టీకి దూరమయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు.
అందుకే మీడియాకు దూరం:
ప్రత్యర్థులపై ఎప్పుడు ఫైరింగ్ కామెంట్స్ తో విరుచుకుపడే రోజా.. ఎన్నికల తర్వాత మాత్రం అసలు ముఖం చాటేశారు. సోషల్ మీడియాలో జస్ట్ ఒక పోస్టుతో సరిపెట్టారు. 'జగనన్నా నీవెంటే మేమంతా.. ఈ పోరాటంలో సైనికులమవుతాం' అంటూ అందులో వ్యాఖ్యానించారు.
ప్రచార సమయంలో ప్రదర్శించిన అతి విశ్వాసం, అత్యుత్సాహం వల్లే రోజా మీడియాకు కూడా ముఖం చూపించలేకపోతున్నారని చెబుతున్నారు. ఓటమిపై వాళ్లడిగే ప్రశ్నలకు ఏ సమాధానం చెప్పినా.. అదంతా కప్పి పుచ్చుకునే ధోరణిగానే పరిగణిస్తారు కాబట్టి, కొద్ది రోజులు మీడియాకు దూరంగా ఉండటమే బెటర్ అని ఆమె ఫిక్స్ అయినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.