చంద్రబాబు పాలనలో ప్రాణాలకు భద్రత కరువు :సిపిఐ రామకృష్ణ;అక్రమ కేసులు ఎత్తివేయాలి:సిపిఎం మధు
విజయవాడ:చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలకు భద్రత కరువయ్యిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మంగళవారం విజయవాడలోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కర్నూలు జిల్లా క్వారీ ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియో ప్రకటిస్తే సరిపోతుందా అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రమాద స్థలానికి చంద్రబాబు ఎందుకు వెళ్లలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మృతుల కుంటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను వెంటనే అందించాలని అన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
మంత్రి...వారికి అనుకూలం
మరోవైపు రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రైవేటు ట్రావెల్స్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆర్టీసి ఎన్నికల ప్రచారంలో పాల్గోవాలని సూచించారు. టిడిపి నాలుగేళ్ల పాటు బిజెపితో కలిసుండి ఇప్పుడు పోరాటం పేరిట వేస్తున్న డ్రామాలు, వేషాలు వెంటనే ఆపాలని హితవు పలికారు.
Recommended Video
కేంద్రం...విచారణ
మీడియాలో కనిపించడానికే బిజెపి ఎంపి జివిఎల్ ఏదేదో మాట్లాడుతున్నారని సిపిఐ రామకృష్ణ ఎద్దేవా చేశారు. రూ. 53 వేల కోట్ల పీడీ కుంభకోణం జరిగితే కేంద్రం ఎందుకు విచారణ చేపట్టడం లేదని రామకృష్ణ నిలదీశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై ఈ నెల 10న వామపక్షాల ఆధ్వర్యంలో మేధావులు, ప్రజా సంఘాలతో చర్చిస్తామని, 26న రాయలసీమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
అక్రమ కేసులు...ఎత్తివేయాలి
నెల్లూరు జిల్లా రాపూరు దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన రాపూరు ఎస్సి కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు దళితవాడపై దాడులు చేయడం, అక్రమకేసులు పెట్టిన విషయాన్ని ప్రజలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గాయపడ్డ మహిళలు గాయాలను చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చిన్న సంఘటనను ఆసరా చేసుకొని దళితుల పట్ల పోలీసులు నిరంకుశంగా వ్యవహరించారన్నారు.
లేనిపక్షంలో...ఛలో రాపూరు
రూ.2000 అప్పు విషయంలో జోక్యం చేసుకొని దళితులను స్టేషన్కు తీసుకొచ్చారని చెపుతూ...అదే పెత్తందార్లు, భూస్వాములను అలా తీసుకొస్తారా అని మధు ప్రశ్నించారు. సివిల్ కేసుల్లో ఎస్ఐ ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. పేదలు, దళితులకు ఎవ్వరూ లేరని ఇలా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని, సిపిఎం అండగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. కేసుతో సంబంధం లేని వ్యక్తులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయని పక్షంలో ఇతర రాజకీయపార్టీలు, దళిత సంఘాలను కలుపుకొని 15 రోజుల్లో 'చలో రాపూరు'కు పిలుపునిస్తామన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక దళితులు, బలహీనవర్గాలు, మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఎస్ఐ ప్రవర్తనే ఇంతటి వివాదానికి కారణమైనందున అతడిపై చర్యలు తీసుకోవాలని మధు డిమాండ్ చేశారు.