ఎవరో కిటీకి వద్ద తోశారు: బస్ ప్రమాదంపై ఓ బాధితుడు
హైదరాబాద్: బస్సు ప్రమాదం జరుగుతున్న సమయంలో తాను డ్రైవర్ దగ్గర్లో గల సీట్లో కూర్చున్నానని, తనను ఎవరో తోయడంతో బయటపడ్డానని సాయి శ్రీకర్ అనే బాధితుడు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు తాను కిటికీ నుండి బయటకు దూకేందుకు వెళ్లానని, అప్పటికే డ్రైవర్, క్లీనర్లు బయటకు దూకేశారన్నారు. అక్కడ మరో వ్యక్తి ఉన్నాడని, అతనిని తాను బయటకు నెట్టేశానని, ఆ తర్వాత తనను ఎవరో బయటకు తోశారని, మంటలు బాగా రావడంతో ఆ వేడికి తాను రోడ్డు పైనే స్పృహ తప్పి పడిపోయానని చెప్పారు.
బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదంలో ఐదుగురు టెక్కీలు సహా 45 మంది మృతి చెందారు. సాయి ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డారు. ఇతను హెచ్పిలో బిజినెస్ ఎనలిస్ట్. కళ్ల ముంది నిమిషాల్లో ఘోరం జరిగిపోయిందని చెప్పారు. సాయి బెంగళూరు నుండి హైదరాబాద్ తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇతని శరీరం పదిహేను, ఇరవై శాతం కాలిపోయింది.

ప్రమాదంపై విచారణ
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. రవాణా శాఖ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ఎవి ప్రసాద రావు ఆధ్వర్యంలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ కమిటీ మూడు రోజుల్లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో తెలిపారు. ఇది చాలా బాధాకరమైన సంఘటన అన్నారు.
ప్రమాదానికి కారణం నిర్వాహకుల నిర్లక్ష్యమా.. పొరపాటా.. ప్రమాదవశాత్తు జరిగిందా.. అన్నదానిపై దర్యాప్తు నివేదికను తెప్పించుకుంటామన్నారు. నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో తరచూ ప్రమాదాలు సంభవించడంపై అధ్యయనం చేసి వాటి నిర్వహణను కట్టుదిట్టం చేస్తామన్నారు. బస్సు ప్రమాదంపై ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, తమిళనాడు గవర్నర్ రోశయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications