విభజన బాధాకరం, రెచ్చగొట్టొద్దు: కెసిఆర్కి మర్రి సూచన
విభజన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు స్వస్థలాలకు వెళ్ళిపోవాలని చెప్పడాన్ని తప్పుబట్టారు. తన భార్య సీమాంధ్రకు చెందిన వ్యక్తి అని, కుమారుడు విశాఖపట్నంలో ఉన్నాడని అంటూ, అలాగే అక్కడివాళ్లు ఇక్కడ నివాసం ఉంటున్నారని అన్నారు. అందరి కలయికతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధించిందన్న విషయం మర్చిపోరాదని గుర్తు చేశారు.
హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ను ప్రాంతీయ విద్వేషాలతో చెడగొట్టవద్దని హితవు పలికారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మూడు ప్రాంతాల ప్రజలకు న్యాయం జరిగేలా మాట్లాడాలి తప్ప, ఒక ప్రాంతాన్ని ఉద్ధేశించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వెంటనే రంగంలోకి దిగి ప్రజలను, వారి ఆస్తులను కాపాడేందుకు వీలుగా రెండు బృందాలను హైదరాబాద్లో అందుబాటులో ఉంచాలన్న ప్రతిపాదన తమ కమిటీ చాలాకాలం క్రితమే చేసినట్టు మర్రి గుర్తు చేశారు.
ఇందుకు హైదరాబాద్లో వసతి, సౌకర్యాలు కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా సానుకూలంగా స్పందించలేదని సుతిమెత్తగా విమర్శించారు. జాతీయస్థాయి (ఎన్డిఆర్ఎఫ్)లో ఉన్నట్టే రాష్ట్రాల్లో ఎస్డిఆర్ఎఫ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఫైలిన్ తుపాను, వరదలు సృష్టించిన బీభత్సం పట్ల మర్రి ఆందోళన వ్యక్తం చేశారు.