రాజీనామాలపై అసెంబ్లీలో బిజెపి మంత్రుల ప్రసంగాలపై విస్మయం...ఇదేంటిలా?
Recommended Video
అమరావతి:ఎపికి ప్రత్యేక హోదా కోసం ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలన్న టిడిపి నిర్ణయానికి ప్రతిస్పందనగా రాష్ట్ర మంత్రి పదవులకు బిజెపి నేతలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే తదనంతరం తమ రాజీనామాల విషయమై అసెంబ్లీలో బిజెపి మంత్రులు ప్రసంగించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అయింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర విభేధాల నేపథ్యంలో టిడిపి కేంద్రమంత్రుల రాజీనామా ప్రకటనలకు ప్రతిస్పందనగా...తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఎపి బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు తదనంతరం శాసనసభలో తమ రాజీనామాల విషయమై మాట్లాడారు.
అయితే ఆ ప్రసంగంలో ఒక బిజెపి మంత్రి పూర్తిగా చంద్రబాబు నాయుడును పొగడ్తలతో ముంచెత్తగా, మరో మంత్రి మాణిక్యాలరావు కూడా తప్పనిసరై మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నామే తప్ప పరిస్థితి అంతా బాగానే ఉందన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో బిజెపి మంత్రుల ప్రసంగాలపై టిడిపి నేతల్లో హర్షం వ్యక్తం అవుతోండగా, మిగిలిన వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.
ఎపికి కేంద్రం అన్యాయం చేస్తోందనే మంత్రి వర్గం నుంచి బైటకు వచ్చేస్తున్నామని సిఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ఎపికి అన్యాయం చేయలేదన్న వాదనకు కట్టుబడి ఎపిలోని తమ భాజపా మంత్రులను కూడా పదవులకు రాజీనామా చేయాలని బిజెపి అధిష్టానం ఆదేశించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇటువంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో తమ పార్టీ పదవులకు రాజీనామా చేసిన బిజెపి మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావు తమ రాజీనామాల విషయమై అసెంబ్లీలో వివరణ ఇస్తూ చేసిన ప్రసంగాలు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేవిధంగా కాకుండా పూర్తి భిన్నంగా సాగాయి. అసలు సమస్య...అందుకు సంబంధించిన వివరణ...రాజీనామాలకు దారితీసిన పరిస్థితుల గురించి వివరణ ఇవ్వకుండా పదవీ విరమణ సందర్భంగా జరిగిన వీడ్కోలు సభలో లాగా మాట్లాడటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ముందుగా వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబుపై ఎడతెరిపి లేని పొగడ్తల వర్షం కురిపించారు. ఆ ప్రశంసల్లో చంద్రబాబును అన్ని కోణాల్లో పొగిడేందుకు కామినేని శ్రీనివాస్ ప్రయత్నించడం గమనార్హం. చంద్రబాబు దేశంలో మరే నేత కష్టపడనంత ఎక్కువగా అహర్నిశలూ కష్టపడుతున్నారని, అలాంటి నేతను తానింతవరకు చూడలేదని చెప్పుకొచ్చారు.
అలాగే రాష్ట్రాన్ని కూడా చంద్రబాబు అభివృద్ది పధంలో పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. తన వైద్య శాఖలో కూడా చంద్రబాబు సహకారంతో ఎన్నో సంస్కరణలు చేశానని, తద్వారా దేశంలోనే స్పూర్తి దాయకమైన రాష్ట్రంగా ఎపిని తీర్చిదిద్దగలిగామని అన్నారు. మంత్రిగా ఉండి తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని దేవుడి ముందు ప్రమాణం చేస్తానన్నారు. అయితే అసలు తమ రాజీనామాకు దారితీసిన పరిస్థితుల గురించి మాత్రం చెప్పకుండా దాటవేశారు.
అనంతరం మాట్లాడిన దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా చంద్రబాబును ప్రశంసించేదుకు ఎక్కువ సమయం కేటాయించారు. చంద్రబాబు టెక్నోక్రాట్ అని, ఆయనను చూసే తాను కూడా టెక్నాలజీ వాడకం నేర్చుకున్నానని అన్నారు. చంద్రబాబు సహకారంతో అవినీతి శాఖగా పేరు బడిన దేవాదాయ శాఖలో మార్పు తేగలిగానన్నారు.
అయితే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముంపు గ్రామాలను ఎపిలో విలీనం చేసేందుకు ప్రత్యేక శ్రద్ద కనబర్చిన మోడీని చివరకు ఆంధ్రా ద్రోహిగా నిలబెట్టిన పరిస్థితి బాధ కలిగించిందన్నారు. అందరూ సమైక్యాంధ్ర అన్న తరుణంలో తమ బిజెపి పార్టీ...ప్రత్యేకాంధ్రకు మద్దతు పలికి అవమానాలు ఎదుర్కోందన్నారు. కానీ చివరకు ప్రత్యేక ఆంధ్రతోనే నేడు ఎంతో అభివృద్ది జరుగుతోందని, అదేవిధంగా ఎపికి ప్రత్యేక ప్యాకేజీ ద్వారా చేసే అభివృద్ది విషయంలోనూ తరువాత తామే కరెక్ట్ అనే విషయం అందరూ అర్ధం చేసుకుంటారన్నారు. ఈ బిజెపి మంత్రి కూడా తమ రాజీనామాలకు దారితీసిన పరిస్థితుల గురించి చెప్పకపోగా అధిష్టానం ఆదేశాలమేరకు తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోందని చెప్పడం గమనార్హం.
అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి మంత్రుల రాజీనామాలను వెంటనే ఆమోదించకపోవచ్చని అంటున్నారు. తద్వారా మంత్రి వర్గంలో వారు మరి కొంతకాలం కొనసాగే అవకాశం ఉంటుందని...ఆ కారణంగానే ఇరువురు మంత్రులు సంయమనంతో ప్రసంగించారని అంటున్నారు.