నాగార్జునకు మళ్లీ ఊరట, సస్పెన్స్: లాయర్ల వాదనలు
హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ అక్రమ కట్టడమని అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో అక్కినేని నాగార్జున రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నాగార్జునకు మంగళవారం మరోసారి తాత్కాలిక ఊరట లభించింది. రేపటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు అధికారులను ఆదేశించింది. కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.
కాగా, ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ అక్రమ కట్టడమని అధికారులు మార్కింగ్ చేయడాన్ని సవాల్ చేస్తూ నాగార్జున రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు విచారణకు స్వీకరించింది. నాగార్జున పిటిషన్ స్వీకరించిన కోర్టు... యధాతథ స్థితిని కొనసాగించాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రాజశేఖర్ రెడ్డి సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్ కన్వెన్షన్ను లీజుకు తీసుకున్న ఎంటర్ ప్రైజెస్ ప్రతినిధి ప్రీతమ్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండింటి పైన పూర్తిస్థాయి విచారణ చేపట్టడానికి న్యాయమూర్తికి సమయం లేక ప్రక్రియను మంగళవారానికి వాయిదా వేశారు. అనంతరం మంగళవారం నాడు విచారణను మరోసారి బుధవారానికి వాయిదా వేశారు.
లాయర్ల వాదనలు
హైకోర్టులో ప్రభుత్వ తరఫు, ఎన్ కన్వెన్షన్ సెంటర్ తరఫు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగాయి. ఎన్ కన్వెన్షన్ సెంటర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... నోటీసులు ఇవ్వకుండా ఎన్ కన్వెన్షన్ సెంటర్ గోడల పైన రెడ్ మార్క్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అది పూర్తిగా పట్టా భూమిలోనే ఉందని చెప్పారు. ఎన్ కన్వెన్షన్కు ఆనుకొని ఉన్న తమ్మిడి కుండ చెరువును సర్వే చేసినప్పుడు తమకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు.
ప్రభుత్వ న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. తమ్మిడి కుంట చెరువులో అధికారులు సర్వే మాత్రమే చేశారని, హద్దులు పాతలేదని చెప్పారు. తమ్మిడికుంట చెరువును సర్వే చేసినప్పుడు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమే అన్నారు. ఎన్ కన్వెన్షన్కు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. గతంలో డీఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకుంటే తిరస్కరించినట్లు చెప్పారు. తాము హద్దులు పాతలేదని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అధికారం జీహెచ్ఎంసీకి ఉందన్నారు.