విభజన: టీ, సీమాంధ్ర మంత్రుల చర్చలు విఫలం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర మంత్రుల మధ్య అనూహ్యంగా గురువారం సమావేశం జరిగింది. అయితే ఇరు ప్రాంతాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉండడంతో ఈ వాదనలు ముందుకు సాగలేదని తెలుస్తోంది. సమావేశంలో తెలంగాణకు చెందిన కె. జానారెడ్డి, శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య, సీమాంధ్రకు చెందిన గంటా శ్రీనివాస రావు, ఎరాసు ప్రతాపరెడ్డి,త ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు.
ఇరు ప్రాంతాల నేతల మధ్య సద్భావన కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. సిడబ్ల్యుసి తీర్మానం మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని సీమాంధ్ర నేతలను కోరామని శ్రీధర్ బాబు చెప్పారు. సోనియా గాంధీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఉమ్మడిగా వ్యతిరేకించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలంగాణకు చెందిన మరో మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు.
అయితే, సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెసు నేతల మధ్య చర్చలు విఫలమయ్యాయని సీమాంధ్రకు చెందిన గంటా శ్రీనివాస రావు తెలిపారు. సమైక్యానికి వేరే ప్రత్యామ్నాయం లేదని ఆయన అన్నారు. అవసరమైతే పెద్ద మనుషుల ఒప్పందం అమలుకు తాము సిద్ధమని మరో మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు.
పెద్ద మనుషుల ఒప్పందం సరిగా అమలు జరగలేదని తెలంగాణ నేతలు అంటున్నారని ఆయన చెప్పారు. వాటిని చర్చించుకుని పరిష్కరించుకోవచ్చు కదా, అంత మాత్రాన రాష్ట్రాన్ని విభజించాలా అని తాము అన్నామని ఆయన అన్నారు. ఇప్పుడు అడ్వొకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలంగాణకు చెందినవారున్నారని, లా సెక్రటరీలు కూడా ఉన్నారని ఆయన అన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని తాము తెలంగాణ నేతలతో చెప్పినట్లు ఆయన తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. సమావేశంలో తాజా రాజకీయాలపై, సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.