ఇదీ ఉద్దేశ్యం: దిగొచ్చిన శివప్రసాద్, గట్టిగా ప్రశ్నించిన బాబు, సుఖాంతం
చిత్తూరు ఎంపీ శివప్రసాద్కు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు క్లాస్ పీకారు. ఈ రోజు ఎంపీ అధినేతను కలుసుకున్నారు.
చిత్తూరు: చిత్తూరు ఎంపీ శివప్రసాద్కు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు క్లాస్ పీకారు. ఈ రోజు ఎంపీ అధినేతను కలుసుకున్నారు.
తాను అన్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తాను మాట్లాడిన మాటల్లో దురద్దేశ్యం లేదని, దళితుల మనోభావాలు అర్థం చేసుకొని, వారిని మరింత దగ్గరకు తీసుకోవాలని మాట్లాడానని చెప్పారని తెలుస్తోంది.
దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారని తెలుస్తోంది. మీ కులానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే నా వద్దకు తీసుకు రావాలని, బహిరంగంగా మాట్లాడటం సరికాదని సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు రావడం లేదని, మార్పు వచ్చిందని కూడా బాబు అన్నారు.
read more: శివప్రసాద్కు టిడిపి నేత హెచ్చరిక
నేను జిల్లాకు వచ్చినా కలవలేదని, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపిస్తే రాలేదని, అలాంటప్పుడు ప్రజలకు, విపక్షాలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నించారు. దాదాపు గంట పాటు భేటీ జరిగింది.
ఇటీవల అంబేడ్కర్ జయంతి సందర్భంగా తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శివప్రసాద్ సీఎంకు వివరణ ఇచ్చుకున్నారు. గతంలో శివప్రసాద్తో కేంద్రమంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు.
చంద్రబాబుపై నిప్పులు
అంబేడ్కర్ జయంతి రోజు శివప్రసాద్ పార్టీ పైన, అధిష్టానంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగడం లేదని వ్యాఖ్యానించారు. కేవలం ఇద్దరే దళిత మంత్రులు ఉన్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
నేతల ఎదురుదాడి
శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై కలకలం రేగింది. ఆయనకు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి తదితరులు కౌంటర్ ఇచ్చారు. కొద్ది రోజుల పాటు శివప్రసాద్ అసంతృప్తితోనే ఉన్నారు. ఇటీవలి వరకు ఆయన అలాగే కనిపించారు.
నాలుగు రోజుల క్రితం కూడా..
అంతేకాదు, నాలుగు రోజుల క్రితం జరిగిన చిత్తూరు జిల్లా నేతల భేటీకి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డితో పాటు శివప్రసాద్ కూడా గైర్హాజరయ్యారు. దీంతో ఆయన అలకవీడనట్లుగా కనిపించింది. ఆయన చాలా రోజులుగా చంద్రబాబును కలిసి వివరణ ఇస్తారని చర్చ జరిగింది. కానీ ఆయన మాత్రం పట్టు వీడలేదు.
హఠాత్తుగా యూటర్న్
ఇప్పుడు, హఠాత్తుగా చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి ఇలా చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు ఆయనను హెచ్చరించారు. కాగా నేతల సంప్రదింపుల తర్వాత.. శివప్రసాద్ చల్లబడ్డారని తెలుస్తోంది. 2019లోను తాను చిత్తూరు ఎంపీనే అని, కానీ ఏ పార్టీయో తెలియదని శివప్రసాద్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీంతో ఆయన టిడిపి వీడుతారనే ప్రచారం కూడా సాగింది.