మాగంటి Vsపీతల: ఉత్తుత్తి రాజీనామాలే, అమీతుమీకి సుజాత రెఢీ?
ఏలూరు: టిడిపి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రి పీతల సుజాత వర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకొన్నాయి.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నియామకం విషయంలో రాజీకి ఇద్దరు కూడ ససేమిరా అనడంతో రాజీనామాలకు దారితీసింది. ఈ విషయమై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జోక్యం చేసుకొన్న ఫలితం లేకుండాపోయింది. ఎంపీ మాగంటి బాబుపై మాజీ మంత్రి పీతలసుజాత వర్గీయులు ఎదురుదాడికి దిగారు.
పశ్చిమగోదావరి జిల్లా టిడిపిలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. మాజీ మంత్రి పీతల సుజాత వర్గీయులకు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు వర్గీయులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నియామకం విషయంలో ఈ విబేధాలు నెలకొన్నాయి.తన అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపీ మాగంటి బాబు పెత్తనం ఏమిటని మాజీ మంత్రి పీతల సుజాత ప్రశ్నిస్తున్నారు.
మాగంటి బాబు వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడును కలిసి ఫిర్యాదుచేయనున్నట్టు పీతల సుజాత వర్గీయులు చెబుతున్నారు. జిల్లాలో పార్టీని నష్టపర్చేలా మాగంటి బాబు వర్గీయులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
పీతల సుజాత వైఖరిని నిరసిస్తూ ఎంపీటీసీల రాజీనామా
మార్కెట్ కమిటీ చైర్మెన్ నియామకం విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన టిడిపి నేతల మధ్య గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. పీతల సుజాత వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం ఇద్దరు జెడ్పీటీసీలు, 17 మంది ఎంపీటీసీలు రాజీనామా చేశారు.దీనిపై పీతల సుజాత వర్గం తీవ్రంగా స్పందిం చింది. రెండు వర్గాల మధ్య మాటల యుద్దం సాగుతోంది.
మాగంటి బాబు వర్గంపై పీతల సుజాత వర్గం ఎదురుదాడి
చింతలపూడి నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు పెత్తనమేమిటని పీతల సుజాత ప్రశ్నిస్తున్నారు. ఎంపిటీసీలతో రాజీనామాలను బాబు చేయించాడని పీతల సుజాత వర్గీయులు ఆరోపిస్తున్నారు.మీవన్నీ ఉత్తుత్తి రాజీనామాలే. బ్లాక్మెయిల్ చేయడం కోసమే రాజీనామా డ్రామాకు తెరలేపారు. మాగంటి బాబు ఎంపీగా గెలిచాక చింతలపూడి నియోజకవర్గానికి చేసిందేమిటి? ఏఎంసీ విషయంలో ఎంపీ పెత్తనమేంటి, ఎంపీటీసీలను ప్రలోభపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయించారు.. అంటూ చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాత వర్గం ఎదురు దాడికి దిగింది.
చింతలపూడిలో పెత్తనం కోసమే బాబు ఆరాటం
చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గంలో పెత్తనం కోసం ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారని పీతల సుజాత వర్గీయలు ఆరోపణలు చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంపై పెత్తనం కోసం కావాలనే రాజీనామాల డ్రామా ఆడుతున్నారని పీతల సుజాత వర్గీయులు విమర్శించారు. చింతలపూడి ఎంపీపీ దాసరి రామక్క సహ పలువురు ఎంపీటీసీలు ఏలూరు ఎంపీ మాగంటి బాబుపై నిప్పులు చెరిగారు.
చంద్రబాబుకు ఫిర్యాదు
ఉద్దేశ్యపూర్వకంగానే టిడిపి పరువును బజారుకీడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఏలూరు ఎంపీ మాగంటి బాబుపై పీతల సుజాత వర్గీయులు ఆరోపణలు చేశారు.కొందరు కావాలని పార్టీ పరువును బజారుకీడుస్తున్నారని ఆరోపించారు. రాజీనామాలతో ఎమ్మెల్యే సుజాతను బ్లాక్మెయిల్ చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ నియామకంలో ఎంపీ మాగంటి జోక్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ మాగంటి వల్లే ఇక్కడ గ్రూపులు తలెత్తాయన్నారు. సమస్యను పరిష్కరించకపోతే చంద్రబాబును కలిసి ఎంపీ వర్గంపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.