చంద్రబాబును చెప్పుతో కొట్టాలనే వ్యాఖ్యలు: జగన్ను ఏకిపారేసిన టిడిపి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు, తెలుగుదేశం పార్టీ నాయకులు దుమ్మెత్తిపోశారు. జగన్పై శుక్రవారంనాడు మంత్రులు, టిడిపి నాయకులు విమర్శల వర్షం కురిపిస్తూ ఏకిపారేశారు.
తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, యనమల రామకృష్ణుడు ప్రతిపక్ష నేత జగన్పై మంత్రులు విరుచుకుపడ్డారు. జగన్కు ప్రతిపక్ష నేత లక్షణాలే కాదు, సంస్కారం కూడా లేదని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. రూ.లక్షకోట్ల అవినీతిపరుడైన జగన్కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కులేదని ఆయన అన్నారు.
ఈడీ అటాచ్ చేసిన జగన్ ఆస్తులను త్వరలోనే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మంత్రి యనమల చెప్పారు. త్వరలోనే జగన్ జైలుకు వెళ్లడం తథ్యమని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు జగన్ నోటి వెంట రావడం లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. జగన్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతున్నారని, వ్యాధి ఉన్నప్పుడు వైద్యుల సలహా తీసుకొని చికిత్స చేయించుకోవాలని ఆయన అన్నారు.
రాజారెడ్డిని ఆదర్శంగా తీసుకొని జగన్ మాట్లాడుతున్నారా అని అడిగారు. సభ్యసమాజం తల దించుకునే విధంగా రాజకీయ నాయకులని అసహ్యించుకునే విధమైన భాష మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు..
ఇంట్లో పనిచేయడం చేతకాక...
ఇంట్లో పని చేయటం చేతకాక జగన్ వూరుమీద పడి మాట్లాడుతున్నారని టిడిపి నాయకుడు పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. తొలి నుంచి జగన్కు మానసిక పరిస్థితి సరిగా లేదని, జగన్ను భరించలేక వైఎస్ గతంలో బెంగళూరుకు పంపారని ఆరోపించారు. జైలుకి వెళ్లినా జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదని, రెక్కలు విరిగిన ఫ్యాన్ను జగన్ ఓఎల్ఎక్స్లో అమ్మాలని ఆయన అన్నారు. చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకుంటే ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు.
జగన్ వ్యక్తిత్వాన్ని భరించలేకే తల్లి సైతం...ఆయన చెల్లెలి దగ్గరికి వెళ్లియారన్నారు. ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అవడం దురృష్టకరమని అన్నారు. జగన్ సానుభూతితో నాయకుడైతే చంద్రబాబు మంచితనంతో మనుగడ సాగిస్తున్నారని అన్నారు.హిళలు చీపురుకట్టలతో...వృద్ధులు చేతికర్రతో...రైతులు రాళ్లతో...యువకులు బట్టలూడదీసి రాష్ట్ర పొలిమేర వరకు తరిమితరిమి కొడతారని పయ్యావుల హెచ్చరించారు. చంద్రబాబు మంచితనం వల్లే జగన్ మనుగడ సాగిస్తున్నాడని తెలిపారు. రాజకీయాల్లో సభ్యత సంస్కారం నేర్చకోవాలని, లేకపోతే నేర్పించాల్సి వస్తుందని పయ్యావుల హెచ్చరించారు.
జగన్ సభ్యత, సంస్కారం లేకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.. జగన్పై వేయి చెప్పులేసే కాలం దగ్గరపడిందని ఆయన మీడియాతో అన్నారు. కోట్ల విజయభాస్కర్రెడ్డిపై వైఎస్ చెప్పులేయించారు..అదే సంస్కృతిని జగన్ పాటిస్తున్నట్టుందని కేఈ అన్నారు.
జగన్కు సంస్కారం నేర్పలేదు...
జగన్కు ఆయన తల్లిదండ్రులు సంస్కారం నేర్పలేదని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. పనికిరాని కుమారుడిని సమాజంలోకి వదిలారని ఆయన చెప్పుకొచ్చారు. జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ది నోరా.. మురికి కాలువా..సిగ్గులేకుండా మాట్లాడి మళ్లీ సమర్థించుకుంటున్నారని ఆయన అన్నారు. చెంపలు వాయించి జగన్కు విజయలక్ష్మి బుద్ధిచెప్పాలని వర్ల రామయ్య చెప్పారు.
జగన్ సైకో.. ఆర్థిక ఉగ్రవాది అని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు వ్యాఖ్యనించారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ను ప్రజలు చెప్పుతో కొట్టి పక్కనబెట్టారని ఆయన అన్నారు ఇప్పటికైనా జగన్ మారకపోతే ప్రజలే సాంఘికబహిష్కరణ చేస్తారని హెచ్చరించారు. తక్షణమే జగన్ క్షమాపణ చెప్పాలని బొండా ఉమ డిమాండ్ చేశారు.
తండ్రి వయసున్న చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. జగన్ తీహార్ జైలుకెళ్లడం తప్పదని అన్నారు. జగన్కు మానసికస్థితి బాగాలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.జగన్ను వాళ్ల తల్లిదండ్రులు అలా పెంచారని పీతల సుజాత వ్యాఖ్యానించారు.
జగన్కు పరిటాల సునీత హెచ్చరిక
ప్రతిపక్షనేతగా జగన్ అలాంటి వ్యాఖ్యలు దారుణమని మంత్రి పరిటాల సునీత అన్నారు. తమ జిల్లాకు వచ్చి ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న జిల్లాలో అనుచిత వ్యాఖ్యలతో దుమారం రేపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు.
లేని పక్షంలో చాలా తీవ్ర పరిణామాలు ఎదర్కుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విభజన తర్వాత కష్టాల్లో ఉన్నప్పటికీ విడతల వారీగా రైతుల రుణాలు మాఫీ చేశామని చెప్పుకొచ్చారు. జగన్ను తరిమికొట్టండి అని ఒక్కసారి ప్రకటన ఇస్తే నీ బతుకు ఏమవుతుందో ఆలోచించుకోవాలని మంత్రి సునీత హెచ్చరించారు.
గౌరవప్రదమైన హోదాలో ఉన్న చంద్రబాబుపై జగన్ అనుచిత వ్యాఖ్యలు బాధాకరమని పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు. అహకారంతో తండ్రి వయస్సున్న చంద్రబాబుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఇలాంటి వ్యక్తి ప్రతిప్రక్షనాయకుడిగా ఉండటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. తాత వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. ఏపీని ఆత్మహత్యలాంధ్రప్రదేశ్గా మార్చిన వ్యక్తి వైఎస్ అని వ్యాఖ్యానించారు.
2014 ఎన్నికల్లోనే జగన్కు ప్రజలు చెంపదెబ్బ కొట్టారని 2019లోనూ అదే పునరావృతం అవుతుందని అన్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్యే గానే కాదు కనీసం వార్డుమెంబర్ అయ్యే పరిస్థితి లేదని అన్నారు. జగన్కు పోయే కాలం వచ్చిందని, పిచ్చిపట్టిందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జగన్ వైఖరి నచ్చక ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని పల్లె రఘునాథ్రెడ్డి అన్నారు.
రుణమాఫీకి వ్యతిరేకమైన వైఎస్ జగన్కు రైతుల గురించి మాట్లాడే నైతికహక్కు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితులపై కనీస అవగాహన లేకుండా యాత్రలు చేస్తున్న జగన్కు రాజకీయ భవిష్యత్తు ఉండే పరిస్థితి కనిపించడం లేదని గుంటూరులో అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేస్తే జగన్ ఓర్వలేక పోతున్నాడని విమర్శించారు. ఇప్పటికే రూ.8వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మరో రూ.3వేల కోట్లను విడుదల చేసిందన్నారు. రాజకీయంగా తమను ఎలా ఎదుర్కోవాలో తెలియని జగన్ ఓదార్పు యాత్రలతో కాలక్షేపం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
'చంద్రబాబును చెప్పుతో కొట్టడం కాదు, నిన్నే జనం చెప్పులతో కొట్టి ఊరేగించి కాలం వస్తుందని టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాను తలుచుకుంటే ఇప్పటికిప్పుడు నిన్ను జనం చేత చెప్పుదెబ్బలు కొట్టించగలనంటూ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు తను తలుచుకోవాలే గానీ పదంటే పది నిముషాల్లో జనం చేత ఆ పని చేయించగలనని హెచ్చరించారు.
రాష్ట్ర విభజనకు సహకరించిన వ్యక్తి నవ నిర్మాణ దీక్షను నయవంచన దీక్ష అనడం చాలా బాధాకరమని టిడిపి ఎమ్మెల్యే వేణుగోపాల్ జగన్పై మండిపడ్డారు. పద్ధతి మార్చుకోవాల్సిన బాధ్యత జగన్ మీద ఉందని, ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా ముందుకు పోతుందనే భావనలో తాము ఉన్నామని ఆయన అన్నారు.