భయమెందుకు: జగన్ దీక్షపై విరుచుకుపడిన టిడిపి నేతలు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్ష కుర్చీకోసం తప్ప ప్రజల కోసం కాదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన జగన్కు బీపీ, షుగర్తో పనేంటని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
సోమవారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్కు హాని జరగాలని తామెవరమూ కోరుకోవడం లేదని, జగన్ ఉంటే తమకే రాజకీయంగా మేలని ముద్దుకృష్ణమ వ్యాఖ్యానించారు.
జగన్ ఎవరిని అడుగుతున్నారు...
వైయస్ జగన్ దీక్షలో క్లారిటీ లేదని రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడుగుతున్నారా? రాష్ర్టాన్ని అడుగుతున్నారా ? కేంద్రాన్ని అడిగితే జగన్ ఢిల్లీలో దీక్ష చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం జగన్ హెల్త్ బులెటిన్ను విడుదల చేస్తే సంతోషించకుండా ప్రైవేటు వైద్యులను నియమించుకొని హంగామా చేస్తున్నారని బొజ్జల విమర్శించారు. ఆయన సోమవారం అనంతపురం జిల్లాలో మీడియాతో మాట్లాడారు.
జగన్ దీక్షకు ఆదరణ తగ్గుతోంది
వైయస్ జగన్ దీక్షకు ఆదరణ తగ్గిపోతుందని, ఆయన దీక్షలో పవిత్రత లోపించిందని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆరోపించారు. ఈ నెల 13న టీడీపీ కార్యాలయంలో కలశాలకు ప్రత్యేక పూజలు చేసి అన్ని మండలాలకు పంపిణీ చేస్తామన్నారు. 14న కలశాలలో ప్రజలు తీసుకువచ్చిన మట్టితో టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు జరిపిస్తామని ఆంజనేయులు వివరించారు.
జగన్ ఆరోపణలు అర్థరహితం
వైద్యులు, వైద్య వ్యవస్థపై జగన్ ఆరోపణలు అర్ధరహితమని మాజీ మంత్రి శనక్కాయల అరుణ ఆరోపించారు. తెలంగాణ, సమైక్య ఉద్యమాలతో విద్యార్థులు ఎంతో నష్టపోయారని, ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతుందని ఆమె సోమవారం గుంటూరులో అన్నారు. ఈ సమయంలో ప్రత్యేక హోదాపై నాటకం ఆడటం సరికాదన్నారు. జగన్ విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని శనక్కాయల అరుణ ఆరోపించారు.
రైతులకు న్యాయం జరిగే వరకు...
రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈనెల 15వతేదీన జరిగే రైతు బతుకు దెరువు యాత్రకు మద్దతివ్వాలని కోరుతూ కర్నూలు డీసీసీ అధ్యక్షుడు బీవై రామయ్యను ఆయన సోమవారం కలిశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం రైతుల భూమును లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని, దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఆయన్నారు.