ఏపీ అసెంబ్లీలో రచ్చ- మళ్లీ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్-15 మంది ఒక్క రోజు పాటు..
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కూడా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఉదయం ప్రశ్నోత్తరాల సమయం మొదలుకాగానే సభ్యులు ప్రశ్నలు అడుగుతుండగానే.. టీడీపీ సభ్యులు నినాదాలు చేసారు. అనంతరం కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా పదే పదే అడ్డు తగిలారు. దీంతో శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ తీర్మానం ప్రవేశపెట్టగా.. స్పీకర్ తమ్మినేని టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇవాళ సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేల్లో.. బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, వెంకటరెడ్డి నాయుడు, జోగేశ్వరరావు, పయ్యావుల కేశవ్, గద్దె రామ్మోహన్, వెలగపూడి రామకృష్ణబాబు, రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి ఉన్నారు. వీరందరినీ ఇవాళ ఒక్కరోజుపాటు సస్పెండ్ చేశారు.
మరోవైపు ఈరోజు ఎనిమిది బిల్లులను ప్రభుత్వం పెడుతోంది. వీటిలో పంజాయతీరాజ్ సవరణ బిల్లు, రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్శిటీల చట్ట సవరణ బిల్లు, ఇండియన్ స్టాంప్స్ సవరణ బిల్లు, ఆర్జీయూకేటీ సవరణ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ సవరణ బిల్లు ఉన్నాయి. వీటిలో పలు బిల్లుల్ని చర్చ లేకుండానే ప్రభుత్వం ఆమోదించుకోవాల్సిన పరిస్ధితి. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత బిల్లులపై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.