టెక్కీ మృతి, కీలక సమాచారం: ముంబై వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన సౌజన్య
విజయవాడ: కృష్ణా జిల్లాలో ఇటీవల కలకలం రేపిన నవ వధువు సౌజన్య హత్య కేసులో కీలక సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. సౌజన్య తన మృతికి ముందు ముంబైకి చెందిన వ్యక్తితో సెల్ ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది.
దీంతో పాటు ఆభరణాలు ఇంట్లోనే ఉంచిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ కేసును త్వరగా ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సౌజన్య సాఫ్టువేర్ ఇంజనీర్గా పని చేస్తున్నారు. ఆమె భర్త కూడా సాఫ్టువేర్ ఇంజనీర్గానే పని చేస్తున్నారు.
కాగా, విజయవాడలో ఓ నవ వధువు అపార్టుమెంట్ పై నుండి కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతి చెందిన ఆమె పేరు సౌజన్య. అయోధ్య నగర్లోని ఓ అపార్టుమెంట్ పై నుండి పడి మృతి చెందారు.
ఆమె ఎండదెబ్బకు స్పృహతప్పి పడిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలో ఆమె పడిన తీరు అనుమానాస్పదంగా ఉందని తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. దానిని పరిశీలించిన అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఆమె వారం క్రితం అపార్టుమెంటు నుండి కిందపడి మృతి చెందారు. సౌజన్యకు ఇటీవలె పెళ్లి జరిగినంది. ఈ నెల 20వ తేదీన కృష్ణలంకకు చెందిన దిలీప్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన వారం రోజుల్లోనే ఆమె మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
తొలుత వడదెబ్బగా భావించినప్పటికీ.. సౌజన్య శరీరంపై గాయాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఆమె భర్త దిలీప్ను పోలీసులు విచారించారు. కాగా, సౌజన్య(28)కు వారం రోజుల క్రితం ఇష్టం లేని పెళ్లి చేశారనే కారణంతో.. అపార్టుమెంట్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.