తిరుపతి ఎమ్మెల్యేలకు తీవ్ర అస్వస్థత
చిత్తూరు: చిత్తూరు జిల్లా తిరుపతి శాసన సభ్యుడు వెంకటరమణ కిడ్నీ సమస్యతో బాధపడుతూ శనివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైయ్యారు. వెంటనే ఆయన్ని అల్లుడు హుటాహుటిన స్విమ్స్కు తరలించారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నేతృత్వంలో వెంకటరమణకు వైద్య సేవలు అందిస్తున్నారు.
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ గత కొంతకాలంగా కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రభుత్వ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుని ఇంటికి వెళ్లారు.
ఇంటిలోపలికి వెడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అక్కడే ఉన్న అల్లుడు సంజయ్, అనుచరుడు ముని శేఖర్ హుటాహుటిన ఆయన్ను స్విమ్స్కు తరలించారు. కిడ్నీలో పొటాషియం శాతం గణనీయంగా పెరగడంతో ఆయన కుప్పకూలిపోయారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ నెఫ్రాలజి విభాగం అధిపతి శివ కుమార్ నేతృత్వంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా డయాలసిస్ ప్రక్రియతో వెంకటరమణకు చికిత్స చేస్తున్నారు. మధుమేహం, కిడ్నీ తదితర సమస్యలతో ఎమ్మెల్యే ఆసుపత్రిలో చేరినట్లు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ తెలిపారు.