ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోండి: టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదం
కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభ్యుడు, ఉద్యోగ సంఘాల మాజీ నేత శ్రీనివాస గౌడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాలనిఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాలో టీజీఏ డైరీ ఆవిష్కరణ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం వెసులుబాటు ఇచ్చింది కదా ఇక్కడే తిష్ట వేస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఆంధ్ర ప్రజలుగా జీవించడానికి ఇబ్బంది లేదని తమ ఉద్యోగాల్లో పనిచేయడం సరికాదన్నారు. ఏ తెలంగాణ బిడ్డ కూడా ఆంధ్రాలో పనిచేస్తామని చెప్పడం లేదని ఆదే తరహాలో మీరు కూడా వ్యవహరించాలని శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణలో రాజరిక పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెసు తెలంగాణ నేత మల్లు రవి అన్నారు. సి-బ్లాక్ నుంచి మీడియాను బయటకు పంపడం దారుణమని ఆయన అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చానల్ను ఇబ్బందులు పెడుతున్నారని, మీడియాపై ఆంక్షల విషయంలో జర్నలిస్టు సంఘాలు స్పందించాలని మల్లురవి మంగళవారం మీడియా సమావేశంలో కోరారు.
డబ్బున్నవారికే తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో పదవులు దక్కుతాయని కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించకపోతే తాము ఎసిబికి ఫిర్యాదు చేస్తామని ఆయన మంగళవారంనాడు చెప్పారు. కేంద్రంతో సఖ్యతగా ఉన్న టిఆర్ఎస్ నాయకులు బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే దద్దమ్మలమని అంగీకరించాలని ఆయన అన్నారు.