టీడీపీకి విశాఖ ల్యాండ్స్కాం షాక్: తమ భూమి కబ్జా చేశారంటూ బాధితుల ఫిర్యాదు
విశాఖపట్నం: భూకుంభకోణం కేసులో అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తమ కష్టార్జీతంతో కొనుగోలు చేసిన తమ స్థలాలను కబ్జాదారులు కాజేశారని, లేఅవుట్ స్థలాలను సైతం వదలడం లేదని విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో గురువారం 168 మంది బాధితులు ఫిర్యాదు చేశారు.
సర్వే పనులు సకాలంలో జరగడం లేదంటూ వారు ఆవేదన చెందారు. అంతేగాక, ఈ భూకుంభకోణంలో అధికార పార్టీకి చెందిన పలువురు ఉన్నారని చెప్పారు. లేఅవుట్లను కూడా వదలకుండా కబ్జా చేసి, కంచెలు వేశారని, అక్కడికి వెళితే దాదాగిరి చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు.
'విశాఖలో రూ.500కోట్ల భూకుంభకోణం', ఎవరా టీడీపీ నేత?
కాగా, విశాఖ గ్రామీణ మండల పరిధిలోని మధురవాడ, కొమ్మాది గ్రామాల్లో వెలుగుచూసిన భూ దస్త్రాల తారుమారు వ్యవహారం నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గురువారం బహిరంగ విచారణ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అనంతరం సీఎం చంద్రబాబు ఈ భూకుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారంనాటి బహిరంగ విచారణ రద్దుచేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయినా చాలా మంది బాధితులు రావటంతో జాయింట్ కలెక్టర్ సృజన వారి అర్జీలను స్వీకరించారు.
అయ్యన్న ఇలాగేవుంటే..: గంటా హెచ్చరిక, బాబుకు వివరంగా చెప్పారు
ఇక్కడ భూములు కొనుగోలు చేసిన పొరుగు జిల్లాలకు చెందిన వారు కూడా తమ ఫిర్యాదులను అందజేశారు. భీమిలి, చినగదలి మండలాల పరిధిలో అధికార పక్ష నేతల తీరుపై పలువురు ఫిర్యాదు చేశారు. కాగా, విశాఖ భూకుంభకోణంలో పలువురు అధికార పార్టీ నేతలు కూడా ఉన్నారని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, ల్యాండ్ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.