కేసీఆర్! మిగులులో ఉన్నాం.. చేయొచ్చు: పొన్నం
కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరి 45 రోజులు గడుస్తున్నా తెరాస ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేరలేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల మరాఠీ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బుధవారం జరిగే కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలన్నారు.
కేసీఆర్ మాటల మరాఠీ అని, ఆయన వట్టి మాటల్ని కట్టిపెట్టి ఆచరణ సాధ్యమయ్యే హామీలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం కేసీఆర్కు పొన్నం బహిరంగ లేఖ రాశారు.
నెల రోజుల్లో కొత్త ప్రభుత్వం సర్దుకోవడానికే సరిపోతుందన్న కేసీఆర్ మాటలు సరికావని, సమయం అవసరం ఉన్న, పెద్ద ఎత్తున నిధులు కావాల్సిన హామీల గురించి తాము ప్రస్తావించటం లేదన్నారు. రుణమాఫీ, అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం, ఆ కుటుంబాల్లోని ఒకరికి ఉద్యోగం, పెన్షన్ పెంపు, ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి కార్యక్రమాల అమలుకు సమయం అవసరం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఖజానాలో మిగులు బడ్జెట్ ఉన్నందున ఎన్నికల్లో ఇచ్చిన అనేక హామీలను అమలు చేసే అవకాశం ప్రభుత్వానికి ఉన్నదన్నారు. వీటన్నిం టినీ పక్కనపెట్టి కొత్త కార్యక్రమాలు, కొత్త పథకాల ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడం తగదన్నారు. రుణ మాఫీపై రోజుకో మెలిక పెడుతూ జాప్యం చేయడం సరికాదని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాభావానికి తోడు రుణాలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ఆచరణ సాధ్యమయ్యే హామీలను నెరవేర్చేందుకు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ఈ నెల 20 తర్వాత గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. తెలంగాణ సాధనలో తమ వంతు కృషి ఉన్నదని, ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తామూ గొంతు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.