చంద్రబాబుకు 'నోటీసు'లలో వాస్తవమెంతా?: కాంగ్రెస్-టీడీపీ దోస్తీ.. మైండ్ గేమా?
హైదరాబాద్: ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు జాతీయ పార్టీ నోటీసులు పంపించే అవకాశముందని శనివారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. నటుడు శివాజీ, టీడీపీ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడు తదితరులు నోటీసుల అంశాన్ని ప్రస్తావించారు.
తెలంగాణపై చంద్రబాబు 'బిగ్' ప్లాన్: కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోను భాగస్వామ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నోటీసులు అనకుండా, కేంద్రం తన వ్యతిరేక పార్టీలను విచారణ సంస్థలతో టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. దీంతో శనివారం కలకలం చెలరేగింది. చంద్రబాబుకు నోటీసులు ఎందుకు వస్తాయి? ఏ విషయంలో వస్తాయి? అనే అంశంపై చర్చ సాగింది. అయితే నోటీసులు అంతా వట్టిదేనని బీజేపీ నేతల వాదన. ఇదంతా టీడీపీ మైండ్ గేమ్గా భావిస్తున్నారు.
టీడీపీ-కాంగ్రెస్ పొత్తు
తెలుగుదేశం పార్టీని స్థాపించింది కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల పైన. అదే కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో కలిసేందుకు టీడీపీ సిద్ధమైంది. 36 ఏళ్ల తర్వాత ఈ పార్టీలు కలుస్తున్నాయి. దీంతో టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కాంగ్రెస్ - టీడీపీ పొత్తు వేడిని తగ్గించేందుకే దీనిని తెరపైకి తెచ్చారా అనే చర్చ సాగుతోంది.
ఆపరేషన్ గరుడ
నటుడు శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ గతంలోను ఓ జాతీయ పార్టీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత దాని గురించి మాట్లాడింది లేదు. తాను బయటపెట్టాను కాబట్టి ఆపరేషన్ గరుడను విజయవంతం చేయలేకపోయారని చెప్పారు. ఇప్పుడు అదే శివాజీ... చంద్రబాబుకు నోటీసులు అని చెప్పడం సంచలనంగా మారింది. ఆయన తర్వాత పలువురు టీడీపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.
నోటీసులపై జోరుగా చర్చ
చంద్రబాబుకు నోటీసులు ఇస్తుందనే ప్రచారంలో నిజమెంత? ఎప్పుడు రాబోతున్నాయి? ఏ విషయంలో ఇస్తారనే చర్చ సాగింది. తెలుగుదేశం పార్టీకి కేంద్రంలోని డెవలప్మెంట్ పైన ఏమైనా సమాచారం ఉందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోటు, ఏపీలో అక్రమాలు అంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో వీటిపై నోటీసులు వస్తాయా అనే చర్చ సాగింది.
వాస్తవం ఎంత?
నటుడు శివాజీ గతంలో చెప్పిన ఆపరేషన్ గరుడ, ఇప్పుడు చేసిన ఆరోపణలు, ఆయన కదలికలను గమనిస్తున్న వారు ఆయన టీడీపీకి అనుకూలమని చెబుతున్నారు. అసలు కాంగ్రెస్, టీడీపీ పొత్తు అంశాన్ని తక్కువ చేసి చూపించేందుకే నోటీసుల అంశాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారని అంటున్నారు.