ఆస్తి-స్వేచ్ఛ కోసం:ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య
అనంతపురం: తన లైంగిక స్వేచ్ఛకు అడ్డుగా ఉండటంతో పాటు మొత్తం ఆస్తిని దక్కకుండా చేస్తాడనే కోపంతో తన ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిందో భార్య.
ఈమె తన భర్తను అత్యంత కిరాతకంగా హతమార్చిన వైన పోలీసులనే విస్మయపరిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణం చోటుచేసుకోగా ఇందులో పాలుపంచుకున్న వారినందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు హాజరుపర్చిన పోలీసులు హత్య వివరాలు వెల్లడించారు.
అనంతపురం జిల్లా సోమందేపల్లి గ్రామంలో కొత్తపల్లి మలుపు ప్రాంతానికి చెందిన వడ్డె రాము, లక్ష్మీదేవి దంపతులు ప్రధాన రహదారి పక్కనే ఓ హోటల్ నిర్వహిస్తున్నారు. హోటల్ నిర్వహణ భార్య లక్ష్మీదేవి చూస్తుండగా హోటల్ పై వచ్చే ఆదాయం సరిపోవడం లేదని భర్త కూలీ పనులకు వెళుతున్నాడు. ఇలా వీరు తమ సంపాదనతో ఇద్దరు పిల్లలను సాకుతూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వీరి హోటల్కు మినరల్ వాటర్ సప్లయి చేసే వాహనం డ్రైవర్ చల్లాపల్లి అశోక్తో లక్ష్మీదేవికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఈ విషయం ఆమె భర్త రాముకు తెలిసిపోవడంతో మద్యం తాగొచ్చి తరచూ లక్ష్మీదేవిని కొట్టడం చేస్తున్నాడు. అంతేకాదు భార్యపై ద్వేషం పెంచుకున్న భర్త తన పేరిట ఉన్న పొలంలో సగ భాగం తన సమీప బంధువుకు ఇవ్వనున్నట్లు చెప్పాడు. దీంతో భర్తపై లక్ష్మీదేవిమరింత కోపం పెంచుకొంది. భర్తను చంపేస్తే తన వివాహేతర సంబంధానికి అడ్డులేకుండా పోవడంతో పాటు ఆస్తి కూడా మొత్తం తనకే ఉండిపోతుందని ఆలోచించింది. అందుకు తగిన పథకం కూడా వేసింది.
ఆ ప్లాన్ ప్రకారం తతనెల 30 వ తేదీన రాత్రి 8 గంటలకు ఇంటికి మద్యం తాగొచ్చి మత్తులో పడుకుని ఉన్న భర్త రాము కళ్లలో యాసిడ్ పోసింది. దీంతో కళ్లు మండి అల్లాడుతున్న భర్తను హిందూపురం ఆసుపత్రికి వెళదామని ఆటోని పిలిపించింది. భర్త కళ్లు కనబడని స్థితిలో ఉండగా ఆ ఆటోలోనే ఆమె ప్రియుడు చల్లాపల్లి అశోక్, ఆమె సోదరి ఆమడగూరు మండలానికి చెందిన శిల్ప, కొత్తపల్లి నరసింహప్పల అనే వ్యక్తితో ఆస్పత్రికని బయలుదేరారు. అయితే దారి మధ్యలోనే రేణుకానగర్ టర్నింగ్ దగ్గర వీరంతా ఆటో ఆపి రాముని కూడా దింపేశారు. ఆ తర్వాత రామును సమీపంలోని కంపచెట్ల తోపులోకి తీసికెళ్లి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత తువ్వాలుతో అతడి గొంతుకు ఉరేసి చంపారు.
ఆ తర్వాత రాము శవాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. మే నెల ఒకటో తేదీన కంప చెట్ల తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గురించి పోలీసులకు సమాచారం రాగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల విచారణలో రాము భార్య ఘాతుకంతో సహా అన్ని విషయాలు బైటపడ్డాయి. దీంతో నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టగా ఆదివారం ఉదయం చాకార్లపల్లి బస్టాప్ వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ శ్రీనివాసులు, ఎస్సై ప్రసాద్, సిబ్బందితో దాడి చేసి అరెస్టు చేశారు. నలుగురు నిందితులను మీడియా ముందు చూపించి అనంతరం పెనుకొండ కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారని పోలీసులు తెలిపారు. మర్డర్ మిస్టరీని తక్కువసమయం వ్యవధిలోనే చేధించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.