ఆ 'ఐపీఎస్' నోరు విప్పితే నిజాలు.. చెప్పాలి, సీఎం సెటిల్మెంట్లు: జగన్ షాకింగ్
తాను నోరు విప్పితే ఎన్నో నిజాలు బయటకు వస్తాయని ఓక సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పారని, ఆ నిజాలు ఏమిటో బయటకు రావాలని, ప్రజలు వాటిని తెలుసుకోవాల్సి ఉందని వైసిపి అధినేత జగన్ అన్నారు.
విజయవాడ: తాను నోరు విప్పితే ఎన్నో నిజాలు బయటకు వస్తాయని ఓక సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పారని, ఆ నిజాలు ఏమిటో బయటకు రావాలని, ప్రజలు వాటిని తెలుసుకోవాల్సి ఉందని వైసిపి అధినేత జగన్ అన్నారు.
చెవిరెడ్డి ఎక్కడ, ఆ ట్రావెల్స్ నాదని నిరూపిస్తారా.. రిజైన్ చేస్తారా: బాబుకు జగన్
ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. వాళ్ల మనుషులు తప్పు చేస్తే సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.
తనకు ఆరెంజ్ ట్రావెల్స్తో సంబంధం ఉందని నిరూపించకుంటే సీఎం చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. జగన్ బినామీ ట్రావెల్స్ అక్రమంగా తిరుగుతున్నాయని టిడిపి నేతలు ఆదివారం ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై జగన్ మాట్లాడారు.
ఆ అధికారి నిజాలు చెప్పాలి
ఓ ఐపీఎస్ అధికారి మాట్లాడుతూ.. తాను నోరు తెరిస్తే చాలా నిజాలు బయటకు వస్తాయని చెప్పారని, అవేంటో ప్రజలకు తెలియాల్సి ఉందని జగన్ అన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో అధికారులకు టిడిపి నేతలు క్షమాపణ చెప్పారని, మరి గన్మెన్ను తోసేశారని, వారికి క్షమాపణలు చెప్పరా అని నిలదీశారు.
ప్రయివేటు వ్యవహారం కోసమే వచ్చారు
టిడిపి నేతలు ఓ ప్రయివేటు వ్యవహారం కోసమే రవాణా శాఖ కార్యాలయానికి వచ్చారని జగన్ ఆరోపించారు. వారు ప్రజాహితం కోసం రాలేదని చెప్పారు. విషయాన్ని ముఖ్యమంత్రి సెటిల్ చేసి అధికారులను నిస్సహాయస్థితిలో పడేశారని మండిపడ్డారు.
నాడు వనజాక్షి విషయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను వెనుకేసుకొచ్చారని మండిపడ్డారు. వీళ్ల మనుషులు తప్పు చేస్తే రాజీ కుదుర్చడం, సెటిల్మెంట్లు చేయడం ఏమిటని నిలదీశారు. నేరుగా సీఎం సెటిల్మెంట్లు చేసి అధికారులను ఒత్తిడిలోకి నెడుతున్నారన్నారు.
సింగపూర్, జపాన్ పోయింది.. ఇక లండన్
ఓ రోజు జల దీక్ష, మరో రోజు డిజైన్ పేరుతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజెంటేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. రాజధాని అంశంలో సింగపూర్, జపాన్ పోయిందని, ఇప్పుడు లండన్ అంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకు ఒక్క ఇటుక పెట్టలేదన్నారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు కాకముందే రూ.5వేల కోట్లు ఖర్చు చేశారని జగన్ చెప్పారు. ఆ తర్వాత ఏడాదికి రూ.1000 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. ఇప్పుడు పోలవరానికి జాతీయ హోదా వచ్చినా లాభం లేకుండా పోయిందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అధికార పార్టీ డ్రామాలు ఆడుతోందన్నారు.
ప్రతి పని వెనుక పెద్ద స్కాం
చంద్రబాబు సర్కార్ చేసే ప్రతి పని వెనుక కుంభకోణం ఉందని జగన్ ఆరోపించారు. ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమివ్వకుంటే అది ప్రజలకు తీవ్ర అన్యాయం అన్నారు. శాంతిభద్రతలు కాపాడుతున్నామని చెప్పడం కాదని, చర్యలు తీసుకోవాలన్నారు.
బస్సు ప్రమాద బాధితుల కోసం తాను పోరాడితే కేసు పెట్టారని జగన్ వాపోయారు. బాధితులు చెప్పుకున్న అంశాన్నే తాను సభలో అడిగానని అగ్రిగోల్డ్ అంశంపై చెప్పారు. నిన్న జరిగిన ఆర్టీఏ ఘటనకు, నందిగామలో తాను అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనకు లింక్ పెట్టడాన్ని జగన్ ఆక్షేపించారు. ఈ రెండు ఘటనలకు నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారన్నారు.
చెవిరెడ్డి గురించి నిలదీత
తమ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేశారని, ఆయనను బయటకు కనపడనీయడం లేదని, ఆయన అంశాన్ని సభాపతి కోడెల శివప్రసాద రావు ఎందుకు పట్టించుకోవడం లేదని జగన్ అన్నారు. సభ జరుగుతుండగా ఎమ్మెల్యేను అక్రమంగా నిర్బంధించారని జగన్ విమర్శించారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అరెస్టు చేసి ఇంకా విడుదల చేయలేదన్నారు.
సభాపరంగా రక్షణ ఉన్న ఎమ్మెల్యేను ఎలా తీసుకెళ్తారని అడిగారు. దీనిపై అడిగేందుకు సభలో ప్రయత్నిస్తే తనకు మైక్ ఇవ్వలేదని చెప్పారు. అసలు ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా అన్నారు. రవాణా శాఖ కమిషనర్ పైన దాడికి సంబంధించిన అంశాన్ని అడిగితే అరెస్ట్ చేస్తారా అన్నారు.
చంద్రబాబుకు సవాల్
ఆరెంజ్ ట్రావెల్స్తో తనకు సంబంధం ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారని జగన్ అన్నారు. అది నిరూపించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. ఎక్కడ ఏం జరిగినా తనకు సంబంధం ముడిపెడతారా అని అడిగారు. ఇంత దారుణంగా అబద్దాలు ఎందుకని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు అడ్డు పడుతున్నారని అడిగారు.