జగన్ బిఎసి మెలిక: పారిపోయాడని దేవినేని ఉమ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాల సంప్రదింపుల కమిటీ (బిఎసి) సమావేశాన్ని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శనివారం బహిష్కరించింది. తమ పార్టీ నుంచి బిఎసిలో నలుగురికి ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ నిర్ణయం తీసుకుంది. బిఎసిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఇద్దరికి మాత్రమే ప్రాతినిధ్యం కల్పించారు.
ఏడుగురు సభ్యులతోనే ఆంధ్రప్రదేశ్ బిఎసిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. టిడిపి నుంచి నలుగురు, వైసిపి నుంచి ఇద్దరు, బిజెపి నుంచి ఒకరిని బీఏసీలోకి తీసుకోవాలని నిర్ణయించదింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడుకు అవకాశం కల్పించాలని స్పీకర్ ముందు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది.
బిఎసిలో టిడిపి నుంచి చంద్రబాబు, కేఈ కృష్ణమూర్తి, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉంటారు. అయితే తమ పార్టీ నుంచి నలుగురికి అవకాశం ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు డిమాండ్ చేస్తూ సమావేశాన్ని బహిష్కరించింది. దీన్ని అధికార పక్షం తీవ్రంగా తప్పు పట్టింది. మొదటి రోజే వైయస్ జగన్ పారిపోయాడని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు వ్యాఖ్యానించారు.
వైసిపి నుంచి ఇద్దరికే ప్రాతినిధ్యం కల్పించడాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సమర్థించుకున్నారు. సంప్రదాయం ప్రకారమే తాము వ్యవహరించామని ఆయన చెప్పారు. అయితే, స్పీకర్ ముగ్గురిని రమ్మని చెప్పారని, అయినా వారు అదే పట్టుతో ఉన్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విస్మరిస్తోందని ఆయన విమర్శించారు.
శాసనసభ సమావేశాలను సోమ, మంగళవారాలకే పరిమితం చేయాలని బిఎసి నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని శాసనసభ తీర్మానం చేసే అవకాశం ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్ మృతులకు సంతాపం ప్రకటిస్తుంది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఇద్దరు పిల్లలకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేయనుంది