మోడీ వస్తే మాట్లాడలేదు: ఈనాడును చూపిస్తూ.. బాబును దులిపిన జగన్, బీజేపీని టార్గెట్ చేశారు కానీ
అనంతపురం యువభేరీ బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ, నాటి కేంద్రమంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యలు ఏం చెప్పారో వినిపించారు.
అనంతపురం: అనంతపురం యువభేరీ బహిరంగ సభలో వైసిపి అధినేత జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేశారు. ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ, నాటి కేంద్రమంత్రి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యలు ఏం చెప్పారో వినిపించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబుపై ఎక్కువగా నిప్పులు చెరిగారు.
మంగళవారం అనంతపురంలో యువభేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతిలో మోడీ, విభజన బిల్లు పెట్టిన సమయంలో పార్లమెంటులో వెంకయ్య, ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడిన మాటల వీడియోలను చూపించారు.
ఆ మాటకే విలువ లేదా
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని జగన్ చెప్పారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటకే విలువ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి మేనిఫెస్టోలో హోదా అంశాన్ని చేర్చారని, కానీ ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదన్నారు.
అనంతపురం జిల్లాకు హోదా అవసరం
దేశంలో అతితక్కువ వర్షపాతం గల జిల్లా అనంతపురం అని, అతి పెద్ద జిల్లా అనంతపురం అని జగన్ చెప్పారు. వలసలు పోతున్న జిల్లా అనంతపురమే అన్నారు. ఎక్కువ ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న జిల్లా కూడా ఇదే అన్నారు. అనంతపురం వంటి ప్రాంతానికి హోదా ఎంతో అవసరమన్నారు.
మోడీ పర్యటనలో ఊసెత్తలేదు
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం చంద్రబాబు హోదా ఊసెత్తలేదని జగన్ ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తాను రెండుసార్లు నిరాహార దీక్షలు చేస్తానని, ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు ఒత్తిడి తెస్తారని భావించానని, కానీ ఆయన అలా చేయలేదన్నారు. కానీ తన దీక్షను భగ్నం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము బంద్ నిర్వహిస్తే మద్దతివ్వాల్సిన చంద్రబాబు అడ్డుకున్నారన్నారు.
అరిచిగీపెట్టినా పట్టించుకోవట్లేదు
పార్లమెంటు, అసెంబ్లీలలో తాము హోదా అంశాన్ని లేవనెత్తామని జగన్ చెప్పారు. ఎవరు అడ్డుకున్నా ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తూనే ఉన్నామన్నారు. పోరాటం కొనసాగిస్తున్నామని చెప్పారు. విభజన నేపథ్యంలో హైదరాబాద్ వంటి నగరం తెలంగాణకు వెళ్లిన దృష్ట్యా, ఏపీకి లాభం జరిగేందుకు పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అరిచి గీపెట్టినా ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవడం లేదన్నారు.
సాక్షి వద్దు.. అంటూ ఈనాడును ప్రస్తావిస్తూ
అనంతపురంకు చంద్రబాబు ఇక్కడకు వచ్చి, అసెంబ్లీలో చాలా చెప్పారని జగన్ అన్నారు. ఆయన చెప్పినవే అంటూ.. సాక్షిని చూపించనని అలా చూపిస్తే సాక్షిని చూపించారని అంటారని, కాబట్టి ఈనాడులో వచ్చింది చెబుతున్నానని జగన్ అన్నారు. సెప్టెంబర్ 2014 నుంచి అక్టోబర్ 2017 వరకు మూడేళ్ల మధ్య చంద్రబాబు అనంతకు ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏవైనా నెరవేరాయా అని ప్రశ్నించారు. మూడేళ్ల తర్వాత నేను అడుగుతున్నానని అన్నారు.
మీకు ఏమైనా కనిపించాయా
అనంతలో సెంట్రల్ యూనివర్సిటీ, ఏఎంసీ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, ఫుడ్ పార్క్, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ కస్టర్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, పుట్టపర్తిలో విమానాల మరమ్మత్తుల కేంద్రం, ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు వంటి హామీలు ఇచ్చారని, ఒక్కటైనా నెరవేరిందా, ఒక్కటైనా ఎవరికైనా కనిపించిందా అని జగన్ ప్రశ్నించారు. కనీసం ఇక్కడ విమానం వచ్చి ఆగిందా అన్నారు. హంద్రీనీవాను పూర్తి చేస్తామని చెప్పారని, కానీ పిల్ల కాల్వలే తవ్వలేదన్నారు.
ఇదీ చంద్రబాబు నైజం అంటూ
చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఎవరినైనా మోసగిస్తారని, ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారని జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు నైజం తెలిపే ఓ క్లిప్పింగ్ వేస్తామంటూ.. ఎన్నికల ముందు చెప్పిన హామీలకు సంబంధించిన వీడియో చూపించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం చంద్రబాబు నైజం అన్నారు.
చంద్రబాబు అలా చెప్పారు
ప్రత్యేక హోదా రాకపోవడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు కారణమని చంద్రబాబు చెప్పారని జగన్ మండిపడ్డారు. కానీ అది సరికాదని, కేంద్రం ఇష్టం అని చెప్పారు. ఏపీకి హోదా వస్తే ఎన్ని లాభాలు ఉంటాయనే విషయాన్ని జగన్ వివరించారు. ఓసారి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని చంద్రబాబు చెబుతారని, మరోసారి హోదాతో లాభం అంటారని ఎద్దేవా చేశారు.