జగన్ తెగింపు: పవన్ కల్యాణ్ మీద పైచేయి, చంద్రబాబుకు చిక్కులు
అమరావతి: ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద పైచేయి సాధించారు. ప్రత్యేక హోదా కోసం పోరాట కార్యక్రమాన్ని ప్రకటించడం ద్వారా ఆధిక్యత సాధించారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లో పడేశారు. బిజెపితో పొత్తు కోసం జగన్ ప్రయత్నిస్తున్నారనే చంద్రబాబు విమర్శకు తద్వారా అర్థం లేకుండా చేశారు.

పార్టీ ఎంపీల రాజీనామా
పవన్ కల్యాణ్ లెక్కలు తేల్చడానికి నిజ నిర్ధారణ కమిటీ అంటూ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఏకంగా పోరాట కార్యక్రమాన్నే జగన్ ప్రకటించి సంచలనం సృష్టించారు. దానికి తోడు ప్రత్యేక హోదా మాత్రమే కావాలని, ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. తద్వారా తన పోరాటం కేంద్ర ప్రభుత్వంపై స్పష్టంగా ఉందని చెప్పకనే చెప్పారు. తమ డిమాండ్ను అంగీకరించకపోతే ఏప్రిల్ 6వ తేదీన తమ పార్టీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని చెప్పారు.

జగన్ తెగిస్తారని అనుకోలేదు
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ గతంలో ప్రకటించారు. అయితే, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గినట్లు ఇంత వరకు అనిపిస్తూ వచ్చింది. చంద్రబాబు కూడా అలాగే అనుకున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ జగన్ను ప్రశ్నించడం ప్రారంభించారు. ఎంపీలతో రాజీనామా చేయిస్తాననే మాట ఏమైందని ఆయన జగన్ను అడుగుతూ వచ్చారు. జగన్ తాజా ప్రకటనతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లే.

కేసుల వల్ల కేంద్రంతో లాలూచీ...
తనపై ఉన్న కేసుల కారణంగా కేంద్రంతో లాలూచీ పడడానికి జగన్ తాపత్రయ పడుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తూ వచ్చింది. అందుకే ప్రత్యేక హోదా డిమాండును వదులుకోవడమే కాకుండా జగన్ కేంద్రాన్ని నొప్పించని పద్ధతిలో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయన్ని ప్రజలకు కల్పించడానికి ప్రయత్నించింది. దాదాపుగా ప్రజలు కూడా ఆ అభిప్రాయాన్ని విశ్వసించే పరిస్థితిని కల్పించింది.

పవన్ కల్యాణ్ తొలుత ఇలా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరారానికి జెఎసి (ఉమ్మడి కార్యాచరణ కమిటీ)ని ఏర్పాటు చేస్తానని తొలుత ప్రకటించి పవన్ కల్యాణ్ కాస్తా వెనక్కి తగ్గి లెక్కలు తేల్చేందుకు సంయుక్త నిజ నిర్ధారణ కమిటీని వేస్తానని ప్రకటించారు. అంటే, పోరాటం చేయాలనే తొలి ఆలోచన నుంచి ఆయన వెనక్కి తగ్గినట్లు చెప్పవచ్చు. ఈ స్థితిలో జగన్ పోరాట కార్యక్రమాన్ని ప్రకటించి రాజకీయంగా ముందడుగు వేశారు.

భయపడుతున్నారనే విమర్శలకు ధీటైన జవాబు
తనపై ఉన్న కేసుల కారణంగా కేంద్రంపై పోరాటానికి జగన్ భయపడుతున్నారనే విమర్శలను జగన్ ధీటుగా తిప్పికొట్టినట్లయింది. తమ పార్టీ బిజెపితో తెగదెంపులు చేసుకుంటే వైయస్ జగన్ పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారని టిడిపి ఇప్పటి వరకు వాదిస్తూ వచ్చింది. అయితే, దానికి తన పోరాట కార్యక్రమం ద్వారానే జగన్ జవాబు చెప్పినట్లయింది.

పవన్కు చుక్కెదురు
పవన్ కల్యాణ్ తలపెట్టిన సంయుక్త నిజ నిర్ధారణ కమిటీకి ఆదిలోనే చుక్కెదురైంది. ఈ కమిటీకి బిజెపి సహకరించడానికి సిద్ధంగా లేదని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రకటన ద్వారా తేలిపోయింది. ఏ అధికారం ఉందని కమిటీకి లెక్కలు చూపించాలని ఆయన అడిగారు. అందువల్ల పవన్ కల్యాణ్ కమిటీ ముందు పడే సూచలను కనిపించడం లేదు.

చంద్రబాబుకు చిక్కులు ఇలా...
తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవాలని, ఇద్దరు టిడిపి కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయించాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కేంద్ర మంత్రుల చేత రాజీనామా చేయిస్తే చంద్రబాబు దాదాపుగా బిజెపి నుంచి తెగదెంపులు చేసుకున్నట్లే.. జగన్ ప్రకటనతో ఆయన ఈ విషయంలో చిక్కుల్లో పడినట్లే.












Click it and Unblock the Notifications