థ్యాంక్స్ టు జీఎస్టీ, ఏపీకి మరిన్ని ఇబ్బందులు, బాబే చెప్పారు: జగన్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జీఎస్టీ బిల్లుకు థ్యాంక్స్ చెప్పారు. ఆ బిల్లుతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా అనివార్యమైందని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఉన్న జగన్ మంగళవారం ఉదయం సిపిఐ జాతీయ నేత డి రాజాను కలిశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత ఏపకి హోదా అంశం అత్యావశ్యంగా మారిందన్నారు. త్వరలో చట్టంగా మారబోయే జీఎస్టీ వల్ల అమ్మకం ప్రోత్సాహకాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోతాయని, తద్వారా మౌలిక వసతులు లేని ఏపీలో పెట్టుబడులు క్షీణిస్తాయన్నారు.
అందుకే రాష్ట్రాన్ని బతికించాలంటే హోదా ఇవ్వక తప్పదన్నారు. ఆ మేరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. జీఎస్టీ బిల్లు నేపథ్యంలో ఏపీలో మరిన్ని ఇబ్బందులు వస్తాయని, నిరుద్యోగ సమస్య అధిగమవుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో హోదా ఒక్కటే పరిష్కారం అన్నారు. హోదా లభిస్తే పన్ను రాయితీ ప్రోత్సాహకాల్లో మనకు వెసులుబాటు దొరుకుతుందన్నారు.
కాబోయే లీడర్: బాబుకు కలిసొచ్చింది, పవన్ కళ్యాణ్తోనే బతుకులు బాగు!
ఏపీకి పెట్టుబడులు ధారాళంగా వస్తాయన్నారు. పరిశ్రమలు వస్తాయన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. స్వాతంత్ర సాధనకు దేశం దశాబ్దాల పాటు పోరాడిందని జగన్ అన్నారు. ఇప్పుడు హోదా కోసం వైసిపి కూడా ఎంతకాలమైన పోరాడుతుందన్నారు.
ఏపీకి హోదా కాకుండా ప్యాకేజీ వస్తుందన్న వార్తల పైన కూడా జగన్ స్పందించారు. ఏపీకి ఇప్పటికే భారీగా నిధులిచ్చామని కేంద్రం చెబుతోందని, హోదా కాదు ప్యాకేజీపై సమాలోచనలు జరుగుతున్నాయన్న జైట్లీ వ్యాఖ్యలను చంద్రబాబు కూడా ఖండించారన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా పైన రాజీపడితే చరిత్ర హీనులు అవుతారన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. ప్యాకేజీల పేరుతో మభ్యపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రోడ్లు, హైవేలు తదితరాలకు ఇచ్చే సాధారణ నిధులను ప్రత్యేక నిధులుగా పరిగణించడం సరికాదన్నారు. అలా చేయడం ధర్మం కాదని చంద్రబాబే అన్నారన్నారు.