వైఎస్ఆర్ మరణం ఎపికి దురదృష్టకరం:కెవిపి,...మగాళ్లు అయితే:రఘువీరా
పోలవరం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఆయన మరణం ఆంధ్ర రాష్ట్రానికి దురదృష్టమని కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. పోలవరంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని, దాని ఫలాలు కూడా ప్రజలకు అందేవని కేవీపీ రామచంద్రరావు చెప్పారు. పోలవరం వద్ద బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ నీటి విలువ తెలిసిన వ్యక్తి అని, అలాంటి ఆయన మరణం ఆంధ్ర రాష్ట్రానికి దురదృష్టమని కెవిపి వ్యాఖ్యానించారు.

పోలవరం వద్ద ధర్నా సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ తమది పనికిమాలిన పాదయాత్ర అయితే పుణ్యాత్ములు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం అన్ని అనుమతులు తీసుకువస్తే టీడీపీ, బీజేపీలు మా కల అనడం హాస్యాస్పదమన్నారు. 2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ, టీడీపీలు ప్రాజెక్ట్ పేరుతో ప్రజలు జీవితాలతో అడుకోవద్దని తెలిపారు.
పోలవరం వచ్చి ఒక శంకుస్థాపన, ఒక భూమి పూజ మాత్రమే చేస్తున్నారని...కోట్లు రూపాయలు ఖర్చవుతున్నాయి తప్ప ఇంకేమీ జరగటం లేదన్నారు. మాకు గొప్పలు వద్దని...మగాళ్లు అయితే ప్రాజెక్ట్ పూర్తి చేయండని రఘువీరా సవాల్ విసిరారు. మూడున్నర ఏళ్లలో గోదావరి ఇసుక మొత్తం దోచేశారని, మరో ఏడాదిన్నర కాలంలో ఇసుకను కేవలం పుస్తకంలో మాత్రమే చూడవలసిన పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications