'రోజాకు బాబు స్వాగతం పలకాలి, యనమల తెనాలి రామకృష్ణుడిలా'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్, హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రతిపక్ష వైసిపి, అధికార టిడిపి నేతల మధ్య గురువారం వాగ్యుద్ధం నడుస్తోంది. రోజా సస్పెన్షన్ విషయంలో వైసిపి నేతలు మంత్రి యనమల రామకృష్ణుడును తప్పుబడుతున్నారు.
అదే సమయంలో టిడిపి సభ్యులు యనమలను వెనుకేసుకొస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు చూడాలని వారు ఉదాహరణలు చెబుతున్నారు. రోజా పైన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పైన సవాల్ చేస్తామని టిడిపి ఎమ్మెల్యే బోండ ఉమ చెప్పారు.
యనమలకు సిగ్గు, శరం ఉంటే: వైసిపి ఎమ్మెల్యేలు
రోజా సస్పెన్షన్ విషయమై వైసిపి ఎమ్మెల్యేలు మంత్రి యనమల రామకృష్ణుడును టార్గెట్ చేశారు. యనమల వల్లే రోజా పైన సస్పెన్షన్ వేటు పడిందని అభిప్రాయపడ్డారు. యనమలకు సిగ్గు, శరం ఉంటే రాజీనామా చేయాలని చెవిరెడ్డి భాస్కర రెడ్డి మండిపడ్డారు. యనమల తెనాలి రామకృష్ణుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. రోజాకు ముఖ్యమంత్రి స్వాగతం పలకాలని వైసిపీ డిమాండ్ చేసింది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. యనమల రామకృష్ణుడు వంటి మిడిమిడి జ్ఞానం ఉన్న వారు ఇచ్చే దానికి స్పీకర్ తల వంచవద్దన్నారు. హైకోర్టు ఉత్తర్వులను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నాలకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలన్నారు. అధికార పక్షం భేషజాలకు పోకుండా కోర్టు ఉత్తర్వులను సానుకూలంగా తీసుకోవాలన్నారు.
బోండ ఉమ కౌంటర్
ఇంత అసభ్య ప్రవర్తన చేసినా, శాసన సభ పరువును మంటగలిపిన రోజాను వైసిపి వెనుకేసుకు రావడం విడ్డూరమని టిడిపి ఎమ్మెల్యే బోండ ఉమ అన్నారు. మేం తప్పనిసరిగా శాసన సభ అధికారాలు, పార్లమెంటరీ అధికారాల ప్రకారం నడుచుకుంటామని చెప్పారు.
రోజా సస్పెన్షన్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాదని, సభ తీసుకున్న నిర్ణయమన్నారు. ఇప్పుడు చంకలు గుద్దుకుంటున్న వైసిపి నేతలు, ఎమ్మెల్యే రోజా తుది తీర్పు వరకు ఆగాలన్నారు.
నిన్నటి వరకు జ్యుడిషియల్ వ్యవస్థను విమర్శించిన వైసిపికి ఇప్పుడు ప్రేమ పొంగుకు వచ్చిందా అని ప్రశ్నించారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. యనమలను వైసిపి సభ్యులు తప్పుబట్టడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా బోండ ఉమ మాట్లాడుతూ.. గతంలోని కోర్టు తీర్పును ఉదహరించారు.