నేడే మహాధర్నా: విశాఖ భూదందాపై గర్జించనున్న జగన్.. టీడీపీకి ఇబ్బందేనా?
ధర్నాలో పాల్గొనేందుకు ఈ ఉదయం 8గం.కు హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరనున్నారు జగన్. 'సేవ్ విశాఖ' పేరిట ఆయన మహాధర్నాలో ప్రసంగించనున్నారు.
విశాఖపట్నం: విశాఖ భూకుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్ తో గురువారం ఉదయం వైసీపీ మహాధర్నాకు సిద్దమవుతోంది. భారీ ఎత్తున జనసమీకరణ చేసి.. ప్రభుత్వానికి సెగ తాకేలా ధర్నా నిర్వహించాలని వైసీపీ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. విశాఖ నగరంలోని జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ బొమ్మ వద్ద ఈ ధర్నా నిర్వహించనున్నారు.
ధర్నాలో పాల్గొనేందుకు ఈ ఉదయం 8గం.కు హైదరాబాద్ నుంచి విశాఖ బయలుదేరనున్నారు జగన్. 'సేవ్ విశాఖ' పేరిట ఆయన మహాధర్నాలో ప్రసంగించనున్నారు. టీడీపీని, ఆ పార్టీ నేతలను దోషులుగా జనం ముందు నిలబెట్టడమే ధ్యేయంగా ఈ ధర్నా చేపట్టనున్నారు. అయితే ధర్నాకు పోలీసులు అనుమతిస్తారా? లేక గతంలో లాగా జగన్ను ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకుంటారా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

మరోవైపు ఇదే రోజు టీడీపీ సైతం విశాఖలో మహాసంకల్ప దీక్ష తలపెడుతున్నట్లు ప్రకటించి.. ఆపై వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. విశాఖ భూఆక్రమణల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టి.. కేసును నీరుగారుస్తున్న తీరుపై జగన్ ధర్నాలో వివరిస్తారని చెబుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
కాగా, వైసీపీతో పాటు పలు ప్రజాసంఘాలు, బాధితులు, ఇతర విపక్షాలు కూడా మహాధర్నా ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉంది. మహాధర్నా అనంతరం సాయంత్రం 4.30గం.కు విమానంలో జగన్ హైదరాబాద్ వెనుదిరుగుతారు.
ఇదిలా ఉంటే, మహాధర్నా ద్వారా వైసీపీ టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండటంతో.. అటు టీడీపీ సైతం ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. ఆరోపణలతో పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉండటంతో.. జగన్ కు గట్టి కౌంటర్ తప్పేలా లేదు. మొత్తం మీద మహాధర్నాతో మరోసారి రెండు పార్టీల మధ్య వాడి వేడి మాటల యుద్దం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications