సొంత కొడుక్కి ఫైన్ విధించిన సీఐ... రూల్స్ బ్రేక్ చేస్తే ఎవరైనా ఒక్కటేనని వార్నింగ్...
ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. మధ్యాహ్నం 12గం. తర్వాత రోడ్ల పైకి వచ్చేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏ పని లేకపోయినా జులాయిగా రోడ్లపై తిరిగేవారిని చితక్కొడుతున్నారు. అత్యవసర ప్రయాణాలకు ప్రభుత్వం పాసులు మంజూరు చేస్తుండగా.. పాసులు లేకుండా రోడ్డెక్కేవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని పలమనేరులో స్థానిక సీఐ తన సొంత కుమారుడికే ఫైన్ విధించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే సొంత కొడుకునైనా విడిచేది లేదని ఈ చర్యతో సీఐ నిరూపించారు.

ఇదీ జరిగింది...
పలమనేరు పట్టణంలో బుధవారం(మే 13) సీఐ జయరామయ్య కానిస్టేబుళ్లతో కలిసి అంతటా కలియదిరిగారు. కర్ఫ్యూ అమలవుతున్న తీరును స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో ఒకచోట 20 ఏళ్ల యువకుడు పోలీస్ కానిస్టేబుల్కి పట్టుబడ్డాడు. ఏ పని లేకపోయినా టైమ్ పాస్కి అతను రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించాడు. దీంతో అతన్ని పట్టుకుని సీఐ వద్దకు తీసుకొచ్చాడు కానిస్టేబుల్. అయితే ఆ యువకుడు సీఐ కొడుకు అని తెలియడంతో కానిస్టేబుల్ ఆయనకు సారీ చెప్పాడు. కానీ సీఐ మాత్రం చట్టం ముందు అందరూ సమానమేనని... అందరికీ వేసినట్లే తన కొడుకుకు కూడా ఫైన్ వేయాలని కానిస్టేబుల్ను ఆదేశించాడు.

మరోసారి బయట కనిపించవద్దని సీఐ వార్నింగ్...
సీఐ ఆదేశాలతో ఆయన కుమారుడికి కానిస్టేబుల్ రూ.125 జరిమానా విధించాడు. ఈసారికి జరిమానాతో వదిలేస్తున్నామని... మరోసారి బయట కనిపిస్తే కేసు బుక్ చేస్తామని సీఐ తన కొడుకుకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని చెప్పడంతో అతన్ని పంపించేశారు. రూల్స్ను లైట్ తీసుకుంటే సొంత కొడుకునైనా వదిలిపెట్టనని ఈ ఘటనతో సీఐ జయరామయ్య చెప్పకనే చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో పాసులు తీసుకుని తప్పితే అనవసరంగా రోడ్ల పైకి రావొద్దని ఆయన మరొకసారి స్థానికులకు విజ్ఞప్తి చేశారు.
Recommended Video

కఠినంగా అమలవుతున్న కర్ఫ్యూ
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రతీరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. నిత్యావసరాలు,ఇతరత్రా పనులు ఉంటే ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపే పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే పోలీసులు ఫైన్ బాదుతారు. అవసరమైతే కేసులు కూడా బుక్ చేస్తారు. కాబట్టి టైమ్ పాస్ చేయడం కోసం అనవసరంగా రోడ్ల పైకి వెళ్లవద్దు. ప్రస్తుతం నెలకొన్న ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలను రిస్క్ చేసి మరీ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కాబట్టి అనవసరంగా రోడ్ల పైకి వెళ్లి వారి ఆగ్రహానికి గురికావడం,ఫైన్లు కట్టడం కంటే ఇంట్లో ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం.












Click it and Unblock the Notifications