జర్నలిస్టులు ఫ్రంట్లైన్ వారియర్సే..?: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యలు, కరోనా బారినపడుతూ ఇబ్బంది పడుతున్న జర్నలిస్టుల విషయాలపై టీయూడబ్ల్యూజె (ఐజేయు) డిప్యూటీ జనరల్ సెక్రెటరీ విష్ణుదాస్ శ్రీకాంత్ కలిశారు. స్పీకర్ ఇంట్లో కలసి జర్నలిస్టుల సమస్యల గురించి వివరించారు.
జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాల్సిందేనని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నవారికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అవి జర్నలిస్టులకు కల్పించాలని కోరారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో తప్పని పరిస్థితుల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ బారినపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం తరపున, ప్రెస్ అకాడమీ ద్వారా ఆస్పత్రిలో ఉంటే 20 వేలు, హోం క్వారంటైన్ లో ఉంటే కేవలం 10 వేలు మాత్రమే అందిస్తున్నారని చెప్పారు. ఇవి మందులకు కూడా సరిపోవడం లేదని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో జర్నలిస్టులు కష్టాలు పడుతున్నారని విష్ణుదాస్ శ్రీకాంత్ స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డుల విషయంలో కూడా జర్నలిస్టులకు ఎలాంటి సదుపాయాలు లేవని చెప్పారు. వాటిని పునరుద్దరించాలని విన్నవించారు. జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. దీనిపై స్పీకర్ శ్రీనివాసరెడ్డి స్పందించినందుకు యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు.