వీటికి ఆన్సర్ కావాలి.. కేంద్రమంత్రి నిర్మలాకు కేటీఆర్ ట్వీట్
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాన సర్కార్ విమర్శలు కొనసాగుతున్నాయి. మంత్రి కేటీఆర్.. మరోసారి ఫైరయ్యారు. తమ రాష్ట్రంపై పక్షపాతం చూపిస్తోందని విరుచుకుపడ్డారు. దేశానికి అవసరమైనవి పాడైపోయిన డబుల్ ఇంజన్లు కావని.. డబుల్ ఇంపాక్ట్ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను కేటీఆర్ తప్పుపట్టారు.
తాను పేర్కొన్న అంశాలను కూడా నిర్మలా సీతారామన్ తన ప్రసంగాల్లో ప్రస్తావించాలని సూచించారు. ఆర్థిక అంశాల్లో నిపుణురాలైన నిర్మలా సీతారామన్ తాను చెబుతున్న అంశాలను కూడా ప్రసంగాల్లో ప్రస్తావించాలని కేటీఆర్ పేర్కొన్నారు. 67 ఏళ్ల స్వాతంత్ర్య భారతంలో 2014 ముందు వరకు 14 మంది ప్రధానులు మారారని.. అప్పటికి దేశ అప్పు రూ.56 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు.
మోడీ ప్రధాని అయ్యాక గత ఎనిమిదేళ్లలో అప్పు రూ.100 లక్షల కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. దీనివల్ల దేశంలో ప్రతి ఒక్కరిపై అప్పు రూ.1.25 లక్షలకు చేరిందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు కాగా.. జాతీయ తలసరి ఆదాయం కేవలం రూ.1.49 లక్షలేనని గుర్తు చేశారు. జీఎస్ డీపీలో అప్పుల నిష్పత్తిని చూస్తే.. తెలంగాణ చాలా మెరుగ్గా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ జీఎస్ డీపీ, అప్పుల నిష్పత్తి 23.5 శాతమేనని.. దేశంలోని 28 రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉందని వివరించారు. అదే దేశ అప్పులు, జీడీపీ నిష్పత్తి 59 శాతమని గుర్తు చేశారు. అంటే తెలంగాణ అప్పులే తక్కువని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అంత మెరుగ్గా పనిచేస్తే దేశం 4.6 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి ఎదిగి ఉండేదని కేటీఆర్ పేర్కొన్నారు.