డోలాయమాన స్థితిలో ఆర్టీసీ కార్మిక లోకం ... తిరిగి విధుల్లో చేర్చుకుంటారా ? లేదా ?
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి డోలాయమానంగా తయారైంది. విధుల్లోకి తీసుకుంటారా లేదా అన్న చర్చ సాగుతుంది. షరతులతో కూడిన చేరికకు సీఎం కేసీఆర్ ఓకే అంటారేమో అని కొందరు భావిస్తుంటే , రెండు సార్లు చేరమని ఆఫర్ ఇచ్చినా చేరకపోవటంతో ఇప్పుడు విధుల్లోకి తీసుకోరేమో అని కొందరు చర్చిస్తున్నారు. ఆ సమ్మె చేసి విజయ సాధించలేక, ఇటు ఉద్యోగాలు లేక రెంటికి చెడ్డ రేవడిలా మారింది ఆర్టీసీ కార్మికుల పరిస్థితి.
ముగిసిన సీఎం సమీక్ష.. తేలని ఆర్టీసీ భవితవ్యం.. మరో 24 గంటలు నిరీక్షణ
ఆర్టీసీ కార్మికులు 47 రోజుల పాటు పోరాటం చేసినా కనికరించని సీఎం కేసీఆర్
ఆర్టీసీ కార్మికులు 47 రోజుల పాటు పోరాటం చేసినా ఫలితం శూన్యంగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాల మద్దతు తెలిపిన, ఆర్టీసీ కార్మికుల కోసం ప్రజా సంఘాలు పోరాటం చేసినా , గవర్నర్ ను కలిసినా , హైకోర్టును ఆశ్రయించినా సమ్మె విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. ఆర్టీసీ కార్మికులను ఏమాత్రం కనికరించలేదు. నిర్దాక్షిణ్యంగా కార్మికుల పట్ల వ్యవహరించింది తెలంగాణ ప్రభుత్వం.
హైకోర్టు తీర్పుతో సమ్మె విరమణ ఆలోచనల్లో కార్మిక లోకం
ఇక ఇదే సమయంలో హైకోర్టులో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురైంది. సమస్యలు పరిష్కరిస్తుంది అనుకున్న హైకోర్టు ఆర్టీసీ కార్మిక సమస్యలను లేబర్ కోర్టు కు బదలాయించి చేతులు దులుపుకుంది .దీంతో లేబర్ కోర్టులో సైతం తమకు అనుకూలంగా తీర్పు వస్తుందో లేదో అన్న భయంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ఉద్యోగాలలో జాయిన్ అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు.కానీ బేషరతుగా తమను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ప్రభుత్వానికి తమ విజ్ఞప్తి తెలియజేశారు.
నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష ... ఊసే లేని ఆర్టీసీ కార్మిక సమస్య
అయితే ఇదే క్రమంలో నిన్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ గురించి కీలక సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో నిర్ణయం తీసుకుంటారు అనుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం పై అందరి దృష్టి మళ్లింది. కానీ సీఎం కెసిఆర్ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, హైకోర్టు నిర్ణయాలు, ఇంకా ఆర్టీసీపై నడుస్తున్న కేసులు అన్నింటిపైనా సమగ్రంగా సమీక్షించి చివరకు ఆర్టీసీని భరించడం కష్టమని తేల్చి చెప్పేశారు. ఎంత సహాయం చేసిన ఆర్టీసీ నిలబడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
నేడు హైకోర్టు రూట్ల ప్రైవేటీకరణ పై తీర్పు తర్వాత కార్మికుల విషయంలో స్పందిస్తారా ?
ఇక రూట్ల ప్రైవేటీకరణ పై నేడు హై కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆర్టీసీ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.అయితే ఆర్టీసీ పై సమీక్ష లో ఇన్ని విషయాలపై చర్చించిన కెసిఆర్ కార్మికుల విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే విషయంపై సీఎం కేసీఆర్ అసలు మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఆర్టీసీ కార్మికుల టెన్షన్ పెరిగిపోతోంది.
47 రోజులు పోరాటం,29 మంది కార్మికులు బలి .. అయినా మొండిగా ఉన్న సీఎం
తమ న్యాయమైన డిమాండ్ల కోసం 47 రోజులు పోరాటం చేసి, 29 మంది కార్మికులు ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీరుతో ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ సీఎం కేసీఆర్ కనికరించలేదు. తమవారిని కోల్పోయిన ఆర్టీసీ కార్మిక కుటుంబాలు దీనంగా రోధిస్తున్న సీఎం కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాంటి మొండితనం ఉన్న కెసిఆర్ ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారు అన్న భావన ఆర్టీసీ కార్మికులలో కనిపించటంలేదు.
జీవనోపాధి లేక అవస్థలు పడుతున్న ఆర్టీసీ కార్మిక కుటుంబాలు
ఇప్పటికే జీవనోపాధి లేక ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. ఇంకా సమ్మెను కొనసాగించే పరిస్థితి ఆర్టీసీ కార్మికులలో లేదు . తమకు న్యాయం జరుగుతుందని ఏమాత్రం ఆశ ఉన్నా పస్తులుండి అయినా సమ్మెను కొనసాగించేవారేమో. కానీ ఎలాంటి ఆశలేక, కోర్టులు ఏం చెబుతున్నాయో అర్థం కాక, తమ సమస్యలను పరిష్కరించే వారెవరూ లేరని నిర్ణయం తీసుకుని చివరకు కుటుంబాల కోసం సమ్మెను విరమించాలని భావించారు.
ఆర్టీసీ కార్మికుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తారేమో అన్న చర్చ
కానీ సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించాలి అన్న ధోరణి ఇప్పటికీ కనబరుస్తున్నారు. ఈ వైఖరి తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఇబ్బంది పెడుతోంది. ఏది ఏమైనా కార్మికులు విధుల్లో చేరడానికి రెండు సార్లు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, ఇప్పుడు వారంతట వారు విధుల్లో చేరతామని ప్రకటనచేసినా వారి విషయం పెద్దగా ఆలోచించకపోవడం ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ గట్టి షాక్ ఇవ్వనున్నారు అన్నసంకేతాలను ఇస్తుంది. దీంతో డోలాయమానంలో ఉన్న ఆర్టీసీ కార్మికుల పరిస్థితి విధుల్లో చేసుకుంటారా లేదా అన్న తర్జనభర్జనల్లో మునిగిపోయేలా చేస్తుంది. మాకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభో అంటూ డిపోల చుట్టూ తిరిగేలా చేస్తుంది.