విధ్వంసం వెనక పీకే.. డీకే అరుణ సంచలన ఆరోపణలు
అగ్నిపథ్ పథకం నిరసిస్తూ యువత రోడ్డెక్కింది. సికింద్రాబాద్లో ఆందోళన హింసాత్మకంగా మారింది. దీనికి సంబంధించి బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం వెనుక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హస్తం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇదీ ముమ్మాటికీ టీఆర్ఎస్ కుట్రే అని ఆరోపించారు. అమాయకుడైన ఆర్మీ అభ్యర్థిని టీఆర్ఎస్ పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు.
ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని.. లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని విచారణకు కోరుతామన్నారు. పెద్ద ఎత్తున అల్లర్లు జరగనున్నాయనే సమాచారాన్ని మందుగానే తెలుసుకోకుండా నిఘా విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయని నిలదీశారు. ముందస్తు వ్యూహంలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్లు జరిగాయని ఆరోపించారు.
శాంతియుత నిరసనకు వచ్చిన వారిని ఓ గదిలో నిర్బంధించింది ఎవరు? నిఘా విభాగం ఏం చేస్తున్నట్లు? రైల్వే స్టేషన్ లోకి పెట్రోల్ బాటిల్స్ ఎలా వచ్చాయి? నిన్న జరిగిన ఘటన ముమ్మాటికీ ముందస్తు వ్యూహంలో భాగంగానే జరిగిందని స్పష్టంగా కనిపిస్తుందని డీకే అరుణ ఆరోపించారు. పోలీసుల దర్యాఫ్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడమీ సహకారంతో విద్యార్థులు విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. అకాడమీల్లో కొంతమంది నిరసనకారులకు షల్టర్ ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు.
సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆర్మీ విద్యార్థులు రైల్వేస్టేషన్కి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లను ప్రైవేటు ఆర్మీ కోచింగ్ అకాడమీ సప్లయ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. 10 ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు ఆందోళనలో పాల్గొన్నట్లు తేల్చారు.