తెలంగాణ సీఎం కేసిఆర్ రాష్ట్రానికి హెడ్... అందుకే కలుస్తున్నా: అజహరుద్దిన్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్సీఏ} ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దిన్ సీఎం కేసిఆర్పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన ప్యానల్తో కలిసి సీఎం కేసిఆర్ కలిసేందుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
కేసిఆర్ రాష్ట్రానికి హెడ్ అని చెప్పిన ఆయన ముఖ్యమంత్రిని కలవడంలో తప్పులేదని అన్నారు. తాను ఓ క్రికెటర్గా మాత్రమే ఉన్నానని, హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికవడం చాల సంతోషంగా ఉందని చెప్పారు. ఇందుకోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ సహాకారం కోసం సీఎం కేసిఆర్ను కలువనున్నట్టు చెప్పారు.
ఇక టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయని రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలను ఆయన కొట్టిపారేశారు. ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదని చెప్పిన ఆయన క్రికెట్ అభివృద్దికి కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు. ఇక అజహరుద్దిన్ ప్యానల్కు ఓటు వేయమని మంత్రి కేటిఆర్ ఓటర్లను కోరారనే ప్రత్యర్థుల వ్యాఖ్యలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
శుక్రవారం హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో అసోసియేషన్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 226 ఓట్లకు గాను 223 ఓట్లు పోల్ అయ్యాయి. అజహర్కు 147 ఓట్లు పడగా, ప్రత్యర్థి ప్రకాశ్ జైన్కు 73, దిలీప్ కుమార్ ప్యానల్కు 3 ఓట్లు పడ్డాయి. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రత్యర్థి ప్రకాశ్ చంద్ జైన్పై అజహారుద్దిన్ 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపోందారు. హెచ్సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.