గల్ఫ్ కార్మికులకు "రైతుబంధు" దూరం.. కేంద్రమంత్రికి వినతిపత్రం.. ఇలా చేయొచ్చని సూచనలు..!
హైదరాబాద్ : సప్త సముద్రాలు దాటి.. కడుపు చేత పట్టుకుని విదేశాలకు వెళుతున్న కష్టజీవులకు సరిగా కడుపునిండని పరిస్థితి. అయినవాళ్లను కాదని.. జీవిత పోరాటంలో గల్ఫ్ దేశాలకు వెళుతున్న వారి వెతలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని సందర్భాల్లో ఏజెంట్లు మోసం చేస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో అక్కడి యజమానులు జీతాలు ఇవ్వక సతాయిస్తున్నారు. ఇక్కడ చేద్దామంటే పనిలేక.. అక్కడ చేసిన పనికి డబ్బులు రాక గల్ఫ్ కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
దూరపు కొండలు నునుపు అన్నట్లుగానే గల్ఫ్కు వెళ్లినవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతోంది. నాలుగు కాసులు కూడబెడదామనుకుంటే తీరని అప్పులపాలవుతున్నవారు అనేకమంది ఉన్నారు. అయితే వ్యవసాయం కలిసిరాక గల్ఫ్ బాట పట్టినవాళ్లు కూడా చాలామందే ఉన్నారు. అలాంటివారికి రైతుబంధు సాయం అందించాలనే వినతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లింది.
గల్ఫ్ బాట పట్టిన వలస రైతులకు రైతుబంధు సాయం..! కేంద్రమంత్రికి వినతిపత్రం
రాష్ట్రానికి చెందిన గల్ఫ్ కార్మికుల సమస్యలపై పోరాడుతున్న తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి ఆదివారం నాడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం గల్ఫ్ దేశాలకు వెళ్లిన రైతులకు కూడా అందేలా కృషి చేయాలని వినతిపత్రం సమర్పించారు.
నంగి దేవేందర్ రెడ్డి వెంట మాజీ దౌత్యవేత్త, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి డా. వినోద్ కుమార్, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న దాదాపు లక్ష మంది సన్నకారు, చిన్నకారు రైతులకు రైతుబంధు పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డిని కోరారు. అదలావుంటే గతంలోనే రైతుబంధు పథకం అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్ కార్యాలయంలో కూడా వినతి పత్రం అందించారు.
గొర్రెల్లా కొనడం కాదు.. జగన్ను చూసి నేర్చుకోండి.. కేసీఆర్కు కోమటిరెడ్డి చురకలు
వ్యవసాయం కలిసిరాకనే గల్ఫ్ బాట.. రైతుబంధు సాయంతో ఆదుకోండి
భూమిని నమ్ముకుని బతికిన బక్క రైతులు వ్యవసాయం కలిసిరాకపోవడంతోనే గల్ఫ్ దేశాల బాట పడుతున్నారనే విషయం మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాంటి వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిన అవసరం ఉందనే విషయం ఆయనకు వివరించారు. గల్ఫ్ కంట్రీలకు వెళ్లిన రైతుల్లో చాలామంది వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలైనవారే ఉన్నారని చెప్పుకొచ్చారు. పొట్టచేతబట్టుకుని ఏడారి దేశాలకు వెళితే అక్కడ కూడా పరిస్థితులు కలిసిరాక దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నవారు కూడా అనేక మంది ఉన్నట్లు వెల్లడించారు.
భూరికార్డుల ప్రక్షాళన చేపట్టి రైతులందరికీ కొత్త పాసు పుస్తకాలు ఇవ్వడమే గాకుండా ఎకరం పొలానికి పంట సాయం కింద 5 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అలాగే ప్రతి అన్నదాతకు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. అదలావుంటే గల్ఫ్ దేశాలకు వెళ్లిన బడుగు రైతులకు మాత్రం రైతుబంధు సాయమందక చాలామంది వలస కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయాలని కోరారు.
రూల్స్ అడ్డొస్తున్నాయి.. ఇలా చేస్తే మంచిదనే సూచనలు..!
రైతుబంధు పథకం అమలులో కొన్ని రూల్స్.. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వలస రైతుల పాలిట శాపంగా మారాయి. భూమి ఎవరి పేరున ఉందో ఆ యజమానికి మాత్రమే పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు అందిస్తున్నారు. అలాగే బీమా దరఖాస్తులపై కూడా స్వయంగా సంతకం చేయాలనే నిబంధన ఉంది. దాంతో గల్ఫ్ దేశాల్లో ఉన్నవారు కేవలం రైతుబంధు కోసమే రావాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం రైతుబంధు సాయం తీసుకోవడానికి రావాలంటే వారికి ఖర్చుతో కూడుకున్న పని. అలా చాలామంది వలస రైతులు రైతుబంధుకు దూరమవుతున్నారు.
ఆ క్రమంలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ తరపున ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. గల్ఫ్ బాట పట్టిన వలస రైతులకు పెట్టుబడి సాయం నాన్ రెసిడెంట్ ఆర్డినరీ బ్యాంకు అకౌంట్లలో లేదా వారి కుటుంబ సభ్యుల పేరుమీదున్న బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. ఆ మేరకు తహసీల్దార్లు లేదా మండల వ్యవసాయ అధికారులు గల్ఫ్ రైతుల నుంచి ఈ-మెయిల్ ద్వారా అంగీకార పత్రం తెప్పించుకోవాలి. అలాగే వారి కోసం సెపరేటుగా వ్యవసాయశాఖ కమిషనరేట్లో స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.