స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థులు కన్ఫామ్..? రేపు ప్రకటన
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ కసరత్తు పూర్తి చేసింది. ఎన్నికల కోసం ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. డిసెంబరు 10న పోలింగ్ జరగనుండగా, ఈ నెల 23వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తారు.
ఇదీ లెక్క..
12 మందిలో ఏడుగురు కొత్తవారికి సీఎం కేసీఆర్ స్థానం కల్పించారు. వీటిలో బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 కేటాయించారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనున్న సంగతి తెలిసిందే.
కన్ఫామ్..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఢిల్లీ వెళ్లే ముందే అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ దీనికి సంబంధించి అధికారికంగా రేపు (సోమవారం) పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్-ఆకుల లలిత, ఆదిలాబాద్- దండే విఠల్, మెదక్-యాదవ్ రెడ్డి, ఖమ్మం-తాతా మధు, నల్గొండ-సి.కోటిరెడ్డి... కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎల్.రమణ, భానుప్రసాద్ అవకాశం ఇస్తారు. వీరిలో భానుప్రసాద్కు రెన్యువల్ చేయగా.. ఎల్ రమణకు తొలిసారి అవకాశం కల్పించారు. ఆయన ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలసిందే. హుజూరాబాద్ ఎన్నికల ముందే.. ఎల్ . రమణ టీడీపీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీసీ నేత, కరీంనగర్ జిల్లా కావడంతో ఎల్.రమణ ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది.
Recommended Video
కవితకు నో..?
మహబూబ్ నగర్ జిల్లాలో రెండు స్థానాలకు సాయిచంద్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలకు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు అభ్యర్థిత్వం ఖరారైంది. ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్సీల స్థానాలు గల్లంతయ్యాయి. నిజామాబాద్ నుంచి మరోసారి పోటీకి విముఖత చూపిన కవితకు రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కవిత స్థానంలో ఆకుల లలితకు అవకాశం ఇచ్చారు.